2017లో చేసిన ఘోరం.. మాజీ మంత్రికి జీవితఖైదు
ABN , First Publish Date - 2021-11-13T01:17:17+05:30 IST
వాస్తవానికి బాధితురాలిపై 2014 నుంచే వీరు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అయితే తీవ్రమైన బెదిరింపులు కారణంగా ఆమె ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు. కాగా 2016 జూలైలో ఆమె మైనర్ కూతురిపై కూడా అత్యాచారానికి..
లఖ్నవూ: అత్యాచార కేసులో నేరం రుజువు కావడంతో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత గాయత్రి ప్రసాద్ ప్రజాపతి సహా మరో ఇద్దరికి కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. చిత్రకోటికి చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో చేపట్టిన విచారణలో గాయత్రి ప్రసాద్ సహా ఆశిశ్ శుక్లా, అశోక్ తివారి, వికాస్ వర్మ, రూపేశ్వర్, అమ్రేంద్ర సింగ్, పింటు, చంద్రపాల్ అనే వ్యక్తులను ఉత్తరప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం విచారించింది. అయితే వికాస్ వర్మ, రూపేశ్వర్, అమ్రేంద్ర సింగ్, పింటు, చంద్రపాల్ అనే నలుగురిపై సాక్ష్యాలు బలంగా లేనందున వారిని నిర్దోషులుగా ప్రకటించింది. గాయత్రి ప్రసాద్ సహా ఆశిశ్ శుక్లా, అశోక్ తివారిలపై బలమైన ఆధారాలు ఉండడంతో వారికి జీవితఖైదు విధిస్తున్నట్లు ప్రత్యేక జడ్జి పీకే రాయి ధర్మాసనం తీర్పు వెలువరించింది.
వాస్తవానికి బాధితురాలిపై 2014 నుంచే వీరు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అయితే తీవ్రమైన బెదిరింపులు కారణంగా ఆమె ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు. కాగా 2016 జూలైలో ఆమె మైనర్ కూతురిపై కూడా అత్యాచారానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు బాధితురాలు తెలిపారు. 2017 ఫిబ్రవరి 18న ఎఫ్ఐఆర్ నమోదైంది.