అది నాయకత్వ లక్షణం కాదు..

ABN , First Publish Date - 2020-09-24T09:13:28+05:30 IST

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ధోనీ ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నించారు...

అది నాయకత్వ లక్షణం కాదు..

మహీ నిర్ణయంపై మాజీల విమర్శ 

న్యూఢిల్లీ: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ధోనీ  ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నించారు. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు సీఎ్‌సకే బరిలోకి దిగగా..విజయానికి 38 బంతుల్లో 103 రన్స్‌ చేయాల్సిన దశలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ధోనీ అలా చేయడం నాయకత్వ లక్షణం కాదని గంభీర్‌ విమర్శించగా, అతడు మరింత ముందు బ్యాటింగ్‌కు రావాల్సిందని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. 


         ఆశ్చర్యపోయా..

‘ధోనీ ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావడంతో ఆశ్చర్యపోయా. 217 పరుగుల లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బరిలోకి దిగడం నాయకత్వ లక్షణం కాదు. అప్పటికే మ్యాచ్‌ చేజారింది. డుప్లెసి ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు’ అని మాజీ ఓపెనర్‌ గంభీర్‌ అన్నాడు. ‘చివరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టావు. అదే 4 లేదా 5వ స్థానంలో వచ్చి అలాంటి భారీ షాట్లు సంధించడంతోపాటు డుప్లెసితో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. 


 నాకర్థం కావడంలేదు

‘ఽభారీ లక్ష్య ఛేదనలో ధోనీ ఏడో నెంబర్‌లో ఎందుకు రావాలనుకున్నాడో నాకైతే అర్థం కావడంలేదు. ఛేదించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉన్నప్పుడు యువ ఆటగాడు రుతురాజ్‌ను బ్యాటింగ్‌లో ముందు పంపడం సరైన విధానం కాదు’ అని గవాస్కర్‌ చెప్పాడు.


 మహీ మేల్కోవాలి

‘ధోనీ ఇప్పటికైనా మేల్కోవాలి. మ్యాచ్‌ను గెలిపించగలిగే అవకాశాన్ని అతడు సృష్టించుకోవాలి. అంటే.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు రావాలి’ అని కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు.

Updated Date - 2020-09-24T09:13:28+05:30 IST