టీఎంసీలో చేరిన గోవా మాజీ సీఎం లుజినో ఫలైరో
ABN , First Publish Date - 2021-09-29T22:57:01+05:30 IST
గోవాలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి బలం చేకురుస్తూ 10 మంది నేతలు బుధవారంనాడు ఆ పార్టీలో ..
పనజీ: గోవాలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి బలం చేకురుస్తూ 10 మంది నేతలు బుధవారంనాడు ఆ పార్టీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గోవా మాజీ ముఖ్యమంత్రి లుజినో ఫలైరో, మరో తొమ్మిది మంది కోల్కతాలో ముఖ్యమంత్రిని మమతా బెనర్జీని కలిసి ఆ పార్టీలో చేరారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో వీరు పోటీ చేసే అకాశాలున్నాయి.
గోవా నేతలు తమ పార్టీలో చేరారని మమతా బెనర్జీ ఓ ట్వీట్లో ప్రకటించారు. గోవా మాజీ ముఖ్యమంత్రి, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిగ్గజ నేత లుజినో ఫలైరోను టీఎంసీ కుటుంబంలోకి రావడం, వారికి తాను ఆహ్వానం పలకడం గర్వకారణంగా భావిస్తున్నానని, అంతాకలిసి గోవాలో విభజన శక్తులకు వ్యతిరేకంగా కీలక పోరాటం సాగిస్తామని, గోవాలో నూతన ఉషోదయానికి నాంది పలుకుతామని మమతా బెనర్జీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. గోవాలో టీఎంసీ అడుగుపెడుతోందని టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇటీవల ప్రకటించిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్కు లుజినో ఫలైరో రాజీనామా చేయడం సంచలనమైంది. తాజాగా ఆయన టీఎంసీలో చేరడంతో ఆయన మద్దతుదారులు, టీఎంసీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది.