రాజకీయాలు కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కావాలి

ABN , First Publish Date - 2020-08-11T12:43:53+05:30 IST

రాజకీయాలు మానుకుని రాష్ట్ర భవిష్యత్‌ గురించి పార్టీలు ఆలోచించాలని..

రాజకీయాలు కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కావాలి

అచ్చంపేట(గుంటూరు): రాజకీయాలు మానుకుని రాష్ట్ర భవిష్యత్‌ గురించి పార్టీలు ఆలోచించాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ తెలిపారు. గుంటూరులోని కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అమరావతే మన రాజధాని అన్నారు. వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు పెట్టడం కాదని, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించడమే వికేంద్రీకరణ అన్నారు. వీకేంద్రీకరణ అంటూనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిని మొదలు పెడితే దానిని చెడగొట్టే ప్రయత్నం నేటి ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌లో దొలేరో సిటీని 12 ఏళ్లుగా కడుతూనే ఉన్నారన్నారు.


50వేల ఎకరాలలో ప్రారంభించిన అమరావతి మూడేళ్లలో పూర్తి కావాలని కొన్ని పార్టీల నాయకులు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. సమస్యలు లేని రాజధానిని నిర్మించేందుకు చంద్రబాబునాయుడు శతవిధాలా ప్రయత్నించారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడుపై నేటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుల ముద్ర వేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు ప్రశ్నించే రోజు వస్తుందన్నారు. సమావేశంలో టీడీపీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-08-11T12:43:53+05:30 IST