సీఎం సొంత నియోజకవర్గానికి నీళ్లు.. నిర్వాసితులకు కన్నీళ్లా..?

ABN , First Publish Date - 2020-09-16T18:10:40+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ ప్రాతినిథ్యం వహించే సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించే..

సీఎం సొంత నియోజకవర్గానికి నీళ్లు.. నిర్వాసితులకు కన్నీళ్లా..?

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి


కొండాపురం(కడప): ముఖ్యమంత్రి జగన్‌ ప్రాతినిథ్యం వహించే సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించే గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు కన్నీళ్లు తెప్పి స్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.10లక్షలు, ప్రకాశం జిల్లా నిర్వాసితులకు రూ.12.50లక్షలు చెల్లిస్తూ ఒకేరోజు పక్కపక్క జీవోలు విడుదల చేయడం వెనుక అంతర్యమేమిటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. తాళ్లప్రొద్దుటూరులో మంగళవారం 13వరోజు ఆందోళన కొనసాగించిన నిర్వాసితులకు ఆయన మద్దతు పలికారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకా రం నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలన్నారు. పునరావాస చట్టం ప్రకారం ఇళ్లు కట్టుకోవడానికి కనీసం రెండేళ్లు గడువు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లాలో ఎందుకూ పనికిరాని భూములకు అధిక ధర ఇచ్చిన ప్రభుత్వం తన సొంత జిల్లాలో మూడుకార్లు పండించే గండికోట రైతులకు అతి తక్కువ ధర చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిర్వాసితుల ఆందోళనకు సీపీఐ ఏరియా కార్యదర్శి సుబ్బారెడ్డి, తెలుగు మహిళా కార్యదర్శి బషిరున్నీషా, మాజీ సర్పంచు నరసింహారెడ్డి, మండల సీపీఐ కార్యదర్శి మనోహర్‌బాబు, ఏఐటీయూసీ కార్యదర్శి చాంద్‌బాషా, ఏఐవైఎఫ్‌ కార్యదర్శి సుధీర్‌ తదితరులు మద్దతు పలికారు.

Updated Date - 2020-09-16T18:10:40+05:30 IST