ఇళ్ల స్థలాల మంజూరులో అవినీతిపై ..విచారణ చేయాలి: మాజీ ఎమ్మెల్యే వర్మ
ABN , First Publish Date - 2020-06-02T09:20:45+05:30 IST
ఇళ్ల పట్టాల మంజూరుకు సాగిన వసూళ్లు, భూసేకరణలో చోటు చేసుకున్న
డెయిరీఫారం సెంటర్(కాకినాడ), పిఠాపురం, జూన్ 1: ఇళ్ల పట్టాల మంజూరుకు సాగిన వసూళ్లు, భూసేకరణలో చోటు చేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డిని కాకినాడలో కలిసి వినతిపత్రం అందజేశారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఒకే సర్వే నెంబరులో భూమికి తొలుత రూ.26 లక్షలు, మరికొందరు రైతులకు రూ.36 లక్షలు వంతున చెల్లించారని, ఇందులో మతలబు ఏమిటో తేల్చాలని ఆయన కోరారు. దుర్గాడలో 400 మంది ఇళ్లపట్టాల లబ్ధిదారులు నుంచి రూ.20 వేలు వంతున వైసీపీ నాయకులు వసూలు చేశారని ఆరోపించారు. పిఠాపురం పట్టణం, కొమరిగిరి సహా నియోజకవర్గంలో భారీగా అవకతవకలు జరిగాయని తెలిపారు. ఈ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.