బీజేపీలో చేరిన ‌జ్ఞాని జైల్ సింగ్ మనుమడు

ABN , First Publish Date - 2021-09-13T21:42:44+05:30 IST

బీజేపీలో చేరడం, తన తాతగారి కలలు పండించే అవకాశం రావడం సంతోషంగా ఉందని..

బీజేపీలో చేరిన ‌జ్ఞాని జైల్ సింగ్ మనుమడు

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ మనుమడు ఇంద్రజీత్ సింగ్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఎంపీ దుష్యంత్ గౌతమ్, బీజేపీ జాతీయ ప్రతినిధి ఆర్‌పీ సమక్షంలో సోమవారంనాడు ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఇంద్రజీత్ సింగ్ మాట్లాడుతూ, బీజేపీలో చేరడం, తన తాతగారి కలలు పండించే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు. నటుడిగా నా కెరీర్ మెరుగుపరచుకోవాలని అనుకున్నప్పుడు తన తాతగారు తనను పిలిచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కలవమని తనతో చెప్పారని, ఆ సమయంలో తాను బీజేపీలో చేరనప్పటికీ, తనను బీజేపీలో చేరమని ఆయన (జ్ఞాని జైల్‌సింగ్) తరుచు చెబుతుండేవారని గుర్తు చేసుకున్నారు. ఎంపీ దుష్యంత్ గౌతమ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ దేశప్రజలందరి, ముఖ్యంగా పంజాబ్ ప్రజల విశ్వాసం చూరగొన్నారని అన్నారు. ఇంద్రజీత్ సింగ్ రాకను స్వాగతించారు. పార్టీకి ఆయన రాకతో అదనపు బలం చేకూరిందని చెప్పారు. పంజాబ్‌లో అనేక కేంద్ర పథకాలు అమలు కావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత విభేదాల్లో ఉందని విమర్శించారు.


Updated Date - 2021-09-13T21:42:44+05:30 IST