కేటీఆర్ సీఎం కానున్నారు.. డబ్బులివ్వాలంటూ బెదిరింపు

ABN , First Publish Date - 2021-02-22T16:11:55+05:30 IST

మంత్రి కేటీఆర్‌ పీఎస్‌ నంటూ ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి యజమానిని

కేటీఆర్ సీఎం కానున్నారు.. డబ్బులివ్వాలంటూ బెదిరింపు

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : మంత్రి కేటీఆర్‌ పీఎస్‌ నంటూ ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి యజమానిని బెదిరించిన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న  ఆస్పత్రి రిసెప్షన్‌ ల్యాండ్‌ లైన్‌కు ఓ ఫోన్‌ వచ్చింది. తాను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పీఎస్‌ తిరుపతి రెడ్డినని అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. వారి నుంచి అస్పత్రి చైర్మన్‌ సెల్‌ నెంబర్‌ తీసుకున్నాడు. ఆ నెంబరుకు కాల్‌ చేసిన సదరు వ్యక్తి తనను పరిచయం చేసుకుని కేటీఆర్‌ సీఎంగా ఎల్‌బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేస్తున్నారని చెప్పాడు. ఇందుకోసం మీడియాలో ప్రకటనల నిమిత్తం డబ్బులు ఇవ్వాలని కోరాడు. అతనిపై అనుమానం వచ్చిన యాజమాన్యం వాకబు చేయగా మోసం అని తేలింది. ఆస్పత్రి మేనేజర్‌ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాగే బెదిరింపులకు పాల్పడిన నాగరాజును పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో నాగరాజు ఇలాగే పలువురికి ఫోన్‌ చేసి మంత్రుల పీఎస్‌ నంటూ బెదిరించాడు. అతనిపై సైబర్‌ క్రైంలో మూడు, సీసీఎస్‌లో  ఒకటి, బాలానగర్‌, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులున్నాయి. 

Updated Date - 2021-02-22T16:11:55+05:30 IST