నలుగురు సీబీఐ అధికారులపై వేటు
ABN , First Publish Date - 2021-01-17T07:50:32+05:30 IST
ఒక అవినీతి కేసుకు సంబంధించి సీబీఐలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను ఆ దర్యాప్తు సంస్థ సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఉన్నతాధికారులపై పాలనాపరమైన చర్య
బ్యాంకు అవినీతి కేసులో ఇద్దరు సస్పెన్షన్, ఇద్దరిపై చర్య
న్యూఢిల్లీ, జనవరి 16: ఒక అవినీతి కేసుకు సంబంధించి సీబీఐలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను ఆ దర్యాప్తు సంస్థ సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఉన్నతాధికారులపై పాలనాపరమైన చర్య తీసుకుంది. ఒక బ్యాంకు మోసం కేసులో నిందితుడి వద్ద నుంచి వీరు ముడుపులు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ఎఫ్ఐఆర్లో ఈ నలుగురి పేర్లను నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అవినీతి కేసుకు సంబంధించి సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం తన సంస్థలోని ఈ అధికారుల ఇళ్లలో గురువారం సోదాలు జరిపింది. సీబీఐలో డీఎస్పీ ర్యాంకు అధికారి ఆర్కే రుషి, అదే హోదాగల మరో అధికారి ఆర్కే సాంగ్వాన్లపై పాలనాపరమైన చర్య తీసుకున్నారు. అలాగే ఇన్స్పెక్టర్ కపిల్ ధన్కడ్, స్టెనో సమీర్ కుమార్ సింగ్లను సస్పెండ్ చేశారు.