నలుగురు డీఆర్‌డీవో ఉద్యోగుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-09-15T01:54:26+05:30 IST

పాకిస్థానీ ఏజెంట్లకు భారత దేశ రక్షణ రంగ రహస్యాలను

నలుగురు డీఆర్‌డీవో ఉద్యోగుల అరెస్ట్

భువనేశ్వర్ : పాకిస్థానీ ఏజెంట్లకు భారత దేశ రక్షణ రంగ రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలతో నలుగురు డీఆర్‌డీవో కాంట్రాక్టు సిబ్బందిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉద్యోగులు చాందీపూర్ ఆన్ సీ యూనిట్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో పని చేస్తున్నారు. పక్కా నిఘా సమాచారం మేరకు వీరిని మంగళవారం అరెస్టు చేశారు. 


ఐజీ ఈస్టర్న్ రేంజ్ హిమాంశు లాల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ నలుగురు డీఆర్‌డీవో ఉద్యోగులను అరెస్టు చేసింది. ఈ ఉద్యోగులకు మొదట ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా సందేశాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. విదేశీ ఏజెంట్లతో వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ ద్వారా వీరు మాట్లాడేవారని పేర్కొన్నారు. ఈ ఉద్యోగులు రక్షణ రంగానికి సంబంధించిన రహస్యాలను ఇచ్చేవారని, అందుకు బదులుగా ఆ ఏజెంట్లు వీరి బ్యాంకు ఖాతాలకు సొమ్మును జమ చేసేవారని తెలిపారు. మూడు రోజులపాటు నిశితంగా గమనించిన తర్వాత వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిని చాందీపూర్ పోలీస్ పరిధిలో తమ ఇళ్ళ వద్ద అరెస్టు చేశామన్నారు. 


భారత దేశ భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతలకు తీవ్ర విఘాతం కలగడానికి కారణమయ్యే నేరానికి పాల్పడినందుకు ఈ ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు ఐజీ చెప్పారు. 


Updated Date - 2021-09-15T01:54:26+05:30 IST