రోడ్డుపై మందుబాబుల వీరంగం.. అడ్డుచెప్పిన పోలీసులకే బెదిరింపులు.. చివరికి ఎంతకి తెగించారంటే..
ABN , First Publish Date - 2021-11-24T07:17:46+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల కొందరు మందుబాబులు రోడ్డుపై చేసిన బరితెగింపు వీడియో ఒకటి సోషల్ మీడియోలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక పోలీస్ అధికారిని నలుగురు యువకులు తాగిన మైకంలో చితకబాదారు. అయితే ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్లో నుంచి తొలిగించబడింది. పోలీసులు ఆ నలుగిరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు...
దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల కొందరు మందుబాబులు రోడ్డుపై చేసిన బరితెగింపు వీడియో ఒకటి సోషల్ మీడియోలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక పోలీస్ అధికారిని నలుగురు యువకులు తాగిన మైకంలో చితకబాదారు. అయితే ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్లో నుంచి తొలిగించబడింది. పోలీసులు ఆ నలుగిరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
ఢిల్లీలోని పశ్చిమ విహార్ ప్రాంతంలో శనివారం రాత్రి సబ్ ఇన్స్పెక్టర్ రాజ్పాల్ సింగ్ రోడ్డుపై గస్తీ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకచోట ఒక కారు ఆగి ఉండడం చూశాడు. దాని డిక్కీపై మందు బాటిళ్లు పెట్టుకుని నలుగురు యువకులు బహిరంగంగానే మద్యపానం చేస్తున్నారు. వారిని రాజ్పాల్ సింగ్ అడ్డుకున్నాడు.
ఇలా బహిరంగంగా మద్యపానం చేయకూడదని, త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ మందుబాబులతో అన్నాడు. కానీ అప్పటికే బాగా మైకంలో ఉన్న ఆ నలుగురు పోలీసు అని చూడకుండా రాజ్పాల్ సింగ్ని బూతులు తిట్టారు. తిరిగి అతను అరెస్టు చేస్తానని హెచ్చరించడంతో వారంతా కలిసి రాజ్పాల్ సింగ్ని చితకబాదారు. కింద పడేసి తన్నారు. ఈ ఘటన జరుగుతుండగా.. ఆ నలుగిరిలో ఒకడు వీడియో కూడా తీశాడు.
రోడ్డుపై ఒక పోలీస్ అధికారిని నలుగురు కొట్టడం చూసి కొందరు ప్రజలు ఆ మందుబాబులను అడ్డుకున్నారు. పోలీసులకి ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి ఆ నలుగురు పారిపోయారు. సబ్ ఇన్స్పెక్టర్ రాజ్పాల్ సింగ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. మొదటిరోజు అసలు ఏమీ మాట్లాడలేకపోయాడు. మరుసటి రోజు పోలీసులకు ఆ నలుగురిపై ఫిర్యాదు చేస్తూ తన వాంగ్మూలం ఇచ్చాడు. రాజ్పాల్ సింగ్ కారు నెంబర్ గుర్తుపెట్టుకోవడంతో సరిపోయింది.
వెంటనే పోలీసులు ఆ నలుగురి గురించి కారు నెంబర్ ద్వారా తెలుసుకొని అరెస్టు చేశారు. డ్యూటీలో ఉన్న ఒక పోలీసు అధికారిపై దాడి చేయడం, అతని విధులకు భంగం కలిగించడం, అనుమతి లేకుండా బహిరంగంగానే మద్యం సేవించడం వంటి అభియోగాలు మోపి ఆ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.