ఇండో-పసిఫిక్‌లో భారత్ సహా నాలుగు దేశాల యుద్ధ విన్యాసాలు త్వరలో

ABN , First Publish Date - 2021-08-03T23:45:42+05:30 IST

నాలుగు దేశాల నావికా దళాలు ఇండో-పసిఫిక్‌లోని గువామ్ తీరంలో

ఇండో-పసిఫిక్‌లో భారత్ సహా నాలుగు దేశాల యుద్ధ విన్యాసాలు త్వరలో

న్యూఢిల్లీ : నాలుగు దేశాల నావికా దళాలు ఇండో-పసిఫిక్‌లోని గువామ్ తీరంలో త్వరలో యుద్ధ విన్యాసాలను నిర్వహించబోతున్నాయి. సముద్రంలోనూ, భూమిపైనా జరిగే ఈ విన్యాసాల్లో భారత దేశం, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ నావికా దళాలు పాల్గొంటాయి. మలబార్, 2021 విన్యాసాల్లో భాగంగా హార్బర్ ఫేజ్ విన్యాసాలు ఆగస్టు 21 నుంచి 24 వరకు జరుగుతాయి, సముద్ర దశ విన్యాసాలు ఆగస్టు 25 నుంచి 29 వరకు జరుగుతాయి. స్పెషల్ ఫోర్సెస్, ప్రత్యక్ష కాల్పులు, జలాంతర్గాముల నిరోధక యుద్ధ కార్యకలాపాలను ఈ దళాలు నిర్వహిస్తాయి. 


భారత దేశం, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ గ్రూప్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ విన్యాసాల్లో అమెరికా నావికా దళానికి చెందిన మూడు యుద్ధ నౌకలు పాల్గొంటాయి. వీటిలో డిస్ట్రాయర్లు, మారిటైమ్ రికన్నైసెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ పీ 8, యాంటీ సబ్‌మెరీన్ వార్‌ఫేర్ హెలికాప్టర్లు, స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి. 


భారత నావికా దళానికి చెందిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రణ్ విజయ్, ఫ్రిగేట్ ఐఎన్ఎస్ శివాలిక్, మారిటైమ్ రికన్నైసెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ పీ8ఐ, ఏఎస్‌డబ్ల్యూ హెలికాప్టర్లు, స్పెషల్ ఫోర్సెస్ ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. 


ఆస్ట్రేలియా నావికా దళానికి చెందిన ఓ నౌక, ఏఎస్‌డబ్ల్యూ హెలికాప్టర్, స్పెషల్ ఫోర్సెస్ ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. 


మూడు సర్ఫేస్ కంబాటెంట్స్, ఓ సబ్‌మెరైన్ మైన్-లేయర్, మారిటైమ్ రికన్నైసెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్, ఏఎస్‌డబ్ల్యూ హెలికాప్టర్లు, స్పెషల్ ఫోర్సెస్‌తో జపాన్ నావికా దళం ఈ విన్యాసాల్లో పాల్గొంటోంది.


Updated Date - 2021-08-03T23:45:42+05:30 IST