‘ఫెడెక్స్‌’ కాల్పుల మృతుల్లో నలుగురు సిక్కులు

ABN , First Publish Date - 2021-04-18T12:17:36+05:30 IST

అమెరికా ఇండియానాపొలి్‌సలోని ఫెడెక్స్‌ డెలివరీ సర్వీస్‌ సదుపాయాల(ఫెసిలిటీ) కార్యాలయం వద్ద గురువారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు సిక్కుజాతీయుల మృతి ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

‘ఫెడెక్స్‌’ కాల్పుల మృతుల్లో నలుగురు సిక్కులు

వాషింగ్టన్‌/చండీగఢ్‌, ఏప్రిల్‌ 17: అమెరికా ఇండియానాపొలి్‌సలోని ఫెడెక్స్‌ డెలివరీ సర్వీస్‌ సదుపాయాల(ఫెసిలిటీ) కార్యాలయం వద్ద గురువారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు సిక్కుజాతీయుల మృతి ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై  ప్రవాసభారతీయులు ముఖ్యంగా సిక్కు జాతీయులు తీవ్ర ఆగ్రహం, భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. విఽధులు ముగించుకుని ఇంటికి వస్తారనుకున్న తమవారు ఉన్మాది కాల్పులకు బలవుతారని కలలోకూడా ఊహించలేదని బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. 


ఫెడెక్స్‌ ఫెసిలిటీ కార్యాలయానికి చెం దిన మాజీ ఉద్యోగి బ్రాండన్‌ స్కాట్‌ హోల్‌(19) విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే.  మృతుల్లో నలుగురు సిక్కు జాతీయులున్నారు. చనిపోయినవారిని అమర్‌జీత్‌ జోహల్‌(66), జస్వీందర్‌ కౌర్‌(64), అమర్‌జిత్‌ ష్కోహోన్‌(48), జస్వీందర్‌ సింగ్‌ (68)గా గుర్తించారు. ఫెడెక్స్‌ కార్యాలయంలో పనిచేసేవారిలో 90 శాతం భారతీయ సంతతి వారే. వీరిలోనూ సిక్కుజాతీయులే ఎక్కువమంది.


కాగా, ఈ ఊచకోత ఘటనపై  అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ఉపాధ్యక్షురాలు  కమలా హారిస్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.  సంతాపసూచికంగా శ్వేతసౌధం, ఇతర ఫెడరల్‌ భవనాలపై జాతీయ జెండాను అవనతం చేయాలని అధ్యక్షుడు  ఆదేశాలు జారీచేశారు. ఇదేఘటనపై పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.

Updated Date - 2021-04-18T12:17:36+05:30 IST