నాలుగు రకాల మేఘాలు

ABN , First Publish Date - 2021-12-31T05:33:37+05:30 IST

అది వర్షాకాలం. నల్లని మేఘాలు నలుదిక్కుల నుంచి పర్వతాల్లా ఆకాశంలోకి లేచి వచ్చాయి. మెల్లగా గాలి మొదలయింది. సాయంత్రం కావస్తోంది. మేఘాలు కమ్ముకొని...

నాలుగు రకాల మేఘాలు

అది వర్షాకాలం. నల్లని మేఘాలు నలుదిక్కుల నుంచి పర్వతాల్లా ఆకాశంలోకి లేచి వచ్చాయి. మెల్లగా గాలి మొదలయింది. సాయంత్రం కావస్తోంది. మేఘాలు కమ్ముకొని... ముందే చీకటి పడింది. తూర్పు దిక్కున ఉన్నట్టుండి పెద్ద వెలుగు కనిపించింది. వెంటనే భూమి బద్దలయ్యేలా శబ్దం వినిపించింది. భయంకరమైన ఆ మేఘ గర్జన ఆగకుండా వినిపిస్తూనే ఉంది. గాలి వేగం పెరిగింది. 


బుద్ధుడు రావి చెట్టు కింద విశాలమైన అరుగు మీద కూర్చొని ఉన్నాడు. భిక్షువు ఒక్కొక్కరూ అక్కడికి చేరారు. ఆకుల గలగలలు, లేత కొమ్మల సవ్వడి వినిపిస్తున్నాయి. ఆకాశం అల్లకల్లోలమయింది. ఉరుముల శబ్దాలతో దద్దరిల్లింది. కానీ ఒక్క చినుకైనా రాలలేదు. కొద్దిసేపటికే మేఘాలన్నీ చెల్లాచెదురయ్యాయి. ఆకాశం మేఘరహితమయింది. సాయంకాలపు లేత ఎండ పరుచుకుంది.

బుద్ధుడు కూర్చొని ఉన్న ఆ జేతవనం పక్షుల కిలకిలరావాలతో పరవశించింది. అది వర్షాకాలం కావడంతో... ఆ జేతవనంలోని అనాథపిండిక ఆరామంలో బుద్ధుడు వర్షావాసం గడుపుతున్నాడు.


ఆ వాతావరణాన్ని, గర్జించిన మేఘాలనూ తన సందేశంలో ఒక భాగం చేస్తూ... ‘‘భిక్షువులారా! చూశారా? మేఘం గర్జించింది. కానీ ఒక్క చినుకునైనా రాల్చకుండానే విశ్రమించింది. కొన్ని మేఘాలు గర్జించకుండానే కురుస్తాయి. మరి కొన్ని మేఘాలు ఉరుముతాయి, కురుస్తాయి. ఇంకొన్ని మేఘాలు ఉరమవు, కురవవు. ఇలా నాలుగు రకాల మేఘాలను చూస్తాం’’ అని చెప్పాడు బుద్ధుడు.


కొందరు భిక్షువులు తలలెత్తి ఆకాశం వైపు చూశారు. ఆకుల సందుల్లోంచి ఆకాశం నిర్మలంగా కనిపించింది. ఎర్రని కాంతి చిటారు కొమ్మల చివర్లలో మెరుస్తోంది.


‘‘భిక్షువులారా!’’ అన్న బుద్ధుని మాట వినిపించగానే అందరూ తలలు దించి శ్రద్ధగా వినసాగారు.

‘‘మేఘాలలో ఉన్నట్టే మనుషులలోనూ ఈ నాలుగు రకాలవారు ఉంటారు. కొందరు మాటలు మాత్రమే చెప్తారు. వాటిని ఆచరించరు. అలా కొందరు ధర్మపారంగతులవుతారు. సూత్రాలను, శ్లోకాలను, గాథలను, గేయాలను, వేదాలను, కథలను, ప్రశ్నోత్తరాలను బాగా నేర్చుకొని పండితులవుతారు. కానీ, వాటి సారాన్ని మాత్రం గ్రహించలేరు. ఇలాంటివారు గర్జించి... వర్షించని మేఘాలలాంటివారు. రెండో రకం వ్యక్తులు మాటలు చెప్పరు. కానీ ఆచరించి చూపుతారు. అలాగే కొందరు గ్రంథాలు పఠించరు, శాస్త్రాలు వల్లెవేయరు. కానీ ధర్మసారాన్ని మాత్రం గ్రహిస్తారు. ఇలాంటివారు ఉరమకుండానే వర్షించే మేఘంలాంటివారు. ఇక, మూడోరకం వ్యక్తులు... వీళ్ళు మాటలూ చెప్పరు, చేతలూ చేయరు. అన్నిటా శూన్యం. గ్రంథాలు చదవరు. పాండిత్యం పొందరు. పోనీ, కనీసం ధర్మాసారాన్ని కూడా గ్రహించరు. ఇలాంటివారు ఉరమని, కురవని మేఘం లాంటివారు. నాలుగో రకం వాళ్ళు చక్కగా మాట్లాడతారు. ఉపదేశాలు ఇస్తారు. అంతకుమించి ఆచరణనూ చూపిస్తారు. పుస్తకాలను పఠిస్తారు. కావ్యాలు, గాథలు, గేయాలు, ధార్మిక గ్రంథాలను క్షుణ్ణంగా చదువుతారు. చదవడమే కాదు, వాటి సారాన్ని గ్రహిస్తారు. అలాంటివారు ఉరిమి, కురిసే మేఘం లాంటివారు’’ అని చెప్పాడు. 


బుద్ధుని మాటలు విన్నవారందరూ ఆ నాలుగు మేఘాలతో తమను తాము పోల్చుకున్నారు. ఇకపై తాము ఎలాంటి మేఘంలా గడపాలో గ్రహించారు.


                                                                                         బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-12-31T05:33:37+05:30 IST