శివ.. శివా.. హుండీల లెక్కింపులో ఉద్యోగి చేతివాటం
ABN , First Publish Date - 2020-05-28T16:48:24+05:30 IST
పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగి చేతివాటానికి పాల్పడ్డారు. మంగళవారం దేవస్థానంలో అధికారులు, పాలకవర్గ సమక్షంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా వల్ల బయటవారిని
సీసీ పుటేజి పరిశీలించి.. వాస్తవమైతే కఠినచర్యలు: ఈవో
పెదకాకాని (గుంటూరు): పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగి చేతివాటానికి పాల్పడ్డారు. మంగళవారం దేవస్థానంలో అధికారులు, పాలకవర్గ సమక్షంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా వల్ల బయటవారిని అనుమతించకుండా దేవస్థాన సిబ్బంది, అర్చకులచే ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో మొత్తం 15 హుండీలకుగాను 11 హుండీలను లెక్కించారు. వాటిద్వారా రూ.32.95లక్షల ఆదాయం లభించింది. కానుకల లెక్కింపులో దేవస్థానానికి చెందిన ఓ ఉద్యోగి చేతివాటానికి పాల్పడినట్లు తెలిసింది. లెక్కింపు వద్ద ఆటు ఇటు తిరుగుతూ ఆ ఉద్యోగి రూ.లక్షకు పైగా రెండు లేక మూడు డబ్బు కట్టలను చాకచక్యంగా పక్కకు తప్పించి, వాటితో ఆఫీస్ రూంలోని తన సీటు వద్దకు వచ్చి అక్కడి బీరువాలో భద్రపరిచినట్లు తెలిసింది. తోటి ఉద్యోగి రూ.పది వేలు అప్పు అడగ్గా వెంటనే ఇచ్చారు.
అయితే ఆ డబ్బును పరిశీలించగా హుండీల లెక్కింపు వద్ద నుంచి తెచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. దేవస్థానం ఉద్యోగి చేతివాటం విషయం ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగుచర్యలు తీసుకోవాలని మంగళవారం రాత్రి ఆదేశించారు. ఉద్యోగి చేతివాటంపై దేవస్థానం ఈవో డి.సుబ్బారావును వివరణ అడగ్గా కొంతమేర అనుమానం వుందని సీసీ పుటేజ్ పరిశీలించాక కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టంచేశారు.