New Jersey లో సాయి దత్త పీఠం, వుడ్ లేన్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్
ABN , First Publish Date - 2021-12-19T17:23:12+05:30 IST
అమెరికాలోని న్యూజెర్సీలో సాయి దత్త పీఠం, వుడ్ లేన్ ఫార్మసీతో కలిసి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించింది.
ఎడిసన్, న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో సాయి దత్త పీఠం, వుడ్ లేన్ ఫార్మసీతో కలిసి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించింది. న్యూజెర్సీలోని వుడ్ లేన్ ఫార్మసీ(ఓల్డ్ బ్రిడ్జి) వారు గత నెలలో కూడా ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమానికి తమవంతు సహకారం అందించారు. ఈ వ్యాక్సిన్ డ్రైవ్లో పిల్లలకు, పెద్దలకు కోవిడ్ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ రెండు డోసులు పూర్తయిన వారికి బూస్టర్ డోస్ కూడా ఇచ్చారు. అమెరికాలో మన వాళ్ళు కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు సాయి దత్త పీఠం ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది.
సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మశంకరమంచి, బోర్డు సభ్యులు వెంకట్ మంత్రిప్రగడ, దాము గేదెల, మురళీ మేడిచెర్ల, సుభద్ర పాటిబండ్ల, వంశీ గరుడ, స్టాఫ్ వాలంటీర్ల సహకారంతో శ్రీ శివ, విష్ణు దేవస్థానం కమ్యూనిటీ హాల్లో ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారు. న్యూజెర్సీ పబ్లిక్యూటీలిటీ కమిటీ ఉపేంద్ర చివుకుల ఇందుకు తన పూర్తి సహకారాన్ని అందించారు.
న్యూజెర్సీ సెనేట్ & అసెంబ్లీ తరఫున స్టెర్లే.ఎస్.స్టాన్లీ మాట్లాడుతూ.. ఈ కరోనా మహమ్మారి సమయంలో స్థానిక సాయిదత్త పీఠంలో వాక్సిన్ సరఫరా చేసిన వుడ్ లేన్ ఫార్మసీ, ఓల్డ్ బ్రిడ్జి న్యూజెర్సీ వారి ఆదర్శప్రాయమైన కమ్యూనిటీ సేవాదృక్పధాన్ని కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని అందించారు. దాదాపు 250 మందికి పైగా తెలుగువారు పిల్లలతో సహా ఈ డ్రైవ్లో టీకాలు వేయించుకున్నారు. ఎంతో ఓపికగా వ్యాక్సిన్లు వేసిన ఫార్మసిస్ట్ రవి, సహకరించిన ఇషిత్ గాంధీ, కిరణ్ తవ్వా లకు సాయి దత్త పీఠం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. స్థానిక వైద్యులు డా. విజయ నిమ్మ, డా. ప్రసాద్ సుధాన్షులు తమ విలువైన సమయాన్ని ఈ ఉచిత వాక్సిన్ శిబిరం కోసం అందించారు.
నర్సులు శిరు పటేల్, సలోని గజ్జర్తో పాటు వాలంటీర్లు గీతావాణి గొడవర్తి, మృదుల భల్లా, అంజలిబుటాలా, రావు ఎలమంచిలి, వికాస్, అన్షు, పల్లవి తదితరులు ఈ వ్యాక్సిన్ డ్రైవ్ విజయవంతం కావడానికి తమ వంతు కృషిచేశారు. వ్యాక్సిన్ వేయించుకున్న పలువురు ఈ వాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేయడంపై హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉచిత వ్యాక్సిన్ శిబిర నిర్వహణకు సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు ఆలయం న్యూజెర్సీ నిర్వాహకులు రఘు శర్మశంకరమంచి, సాయిదత్త పీఠం కమ్యూనిటీ హాల్లో శిబిరం ఏర్పాటుకు సహకరించడంతో పాటు శిబిరానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా సాయి దత్త పీఠం చేసింది.