సులువుగా స్వాతంత్య్రం రాలేదు
ABN , First Publish Date - 2022-08-21T05:13:56+05:30 IST
‘భారతదేశానికి స్వా తంత్య్రం సులువుగా రాలేదు. ఎంతోమంది తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారు. అందులో ముస్లింలు అనేకమంది ఉన్నారు.
- హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్
పాలమూరు, ఆగస్టు 20 : ‘భారతదేశానికి స్వా తంత్య్రం సులువుగా రాలేదు. ఎంతోమంది తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారు. అందులో ముస్లింలు అనేకమంది ఉన్నారు. వారిని మరుగున పెట్ట కండి. భవిష్యత్ తరాలకు స్వాతంత్ర్యోద్య మంలో ముస్లింలు చేసిన ప్రాణత్యాగాలను తెలియ జేయాలి’ అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని అల్మాస్ ఫంక్షన్హాలులో ఏర్పాటు చేసిన స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను మహబూబ్నగర్లో ముస్లింలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సందేశమిచ్చారు. స్వాతంత్య్ర పోరాటంలో టిప్పు సుల్తాన్ చేసిన త్యాగం అజరామరం అని, ఆయన చేసిన త్యాగాన్ని మరుగునపెట్టి ముస్లింలపై ద్వేషం పెరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయటం సరికాదన్నారు. వజ్రోత్సవాలు చేసుకుంటున్న తరుణంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన ఖైదీలను జైలునుంచి విడుదల చేయటం దారుణమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతమంది ముస్లింలు త్యాగాలు చేశారో బి.ఎన్ పాండె రచించిన పుస్తకం చదివితే అర్థం అవుతుందన్నారు. నేటి యువత సోషల్ మీడియాను ఉపయోగించటం తగ్గించుకుని చరిత్రను చదువుకోవాలని సూచించారు. సభలో ఎం.ఎ హాదీ, సాదత్, ఎండీ రహమాన్, హమీద్ఖాన్, అహద్, తఖీహుస్సేన్, ఇంతియాజ్ ఇసాక్ ప్రసంగించారు.