జనం నుంచి వనంలోకి..
ABN , First Publish Date - 2022-02-20T06:42:37+05:30 IST
సమ్మక్క, సారలమ్మల జాతర ముగిసింది. నాలుగు రోజుల పాటు భక్తులు తల్లుల తన్మయత్వంతో మొక్కులు చెల్లించుకున్నారు.
- సమ్మక్క, సారలమ్మలకు భక్తిశ్రద్ధలతో మొక్కులు
- ముగిసిన వనజాతర
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సమ్మక్క, సారలమ్మల జాతర ముగిసింది. నాలుగు రోజుల పాటు భక్తులు తల్లుల తన్మయత్వంతో మొక్కులు చెల్లించుకున్నారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావుతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజాప్రతినిధులు సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసి బంగారంగా భావించే బెల్లాన్ని తల్లులకు సమర్పించుకున్నారు. శనివారం సమ్మక్క, సారలమ్మలు జనం నుంచి వన ప్రవేశం చేశారు. డప్పు చప్పుళ్లతో అమ్మలకు మళ్లీ రావమ్మా అంటూ వీడ్కోలు పలికారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్, వీర్నపల్లి మండలం శాంతినగర్, బాబాయ్ చెరువుతండా, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, కోనరావుపేట మండలం శివంగళపల్లె, ఇల్లంతకుంట మండలం వంతడ్పుల, ముస్తాబాద్ మండల కేంద్రంలో సమ్మక్క, సారలమ్మల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, వీర్నపల్లి మండలం శాంతినగర్, బాబయ్ చెరువు తండా, కోనరావుపేట మండలం శివంగళపల్లె, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో వన దేవతలకు నాలుగు రోజుల పాటు ఒడి బియ్యం, మొక్కులు సమర్పించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సమ్మక్క, సారలమ్మల భక్తులు నాలుగు రోజుల పాటు గద్దెల వద్దే తల్లులకు పూజలు చేస్తూ దర్శించుకున్నారు. భక్తులు నిలువెత్తు బంగారంగా బెల్లాన్ని పంచిపెట్టడంతో పాటు తలనీలాలు సమర్పించుకున్నారు. సమ్మక్క, సారలమ్మల జాతరలతో జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం ఏర్పడింది. జాతరలు జరిగిన వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల్లో పోలీస్లు బందోబస్తును నిర్వహించారు. నిర్వాహకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో జరిగే జాతరలకు పొరుగునున్న కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని భీవండి, షోలాపూర్, గుజరాత్లోని సూరత్ లాంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చారు.