హతవిధీ!
ABN , First Publish Date - 2021-05-18T06:41:52+05:30 IST
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఫ్రంట్లైన వారియర్స్కు పూర్తిస్థాయిలో కొవిడ్ టీకాలు వేయలేదు. చాలా మందికి మొదటి డోసు వ్యాక్సిన పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
- ఫ్రంట్లైన వారియర్స్లో చాలా మందికి అందని వ్యాక్సిన ఫస్ట్ డోసు
- ఆందోళన చెందుతున్న పారా మెడికల్, వైద్య సిబ్బంది
రాజమహేంద్రవరం అర్బన, మే 17: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఫ్రంట్లైన వారియర్స్కు పూర్తిస్థాయిలో కొవిడ్ టీకాలు వేయలేదు. చాలా మందికి మొదటి డోసు వ్యాక్సిన పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలోని నర్సింగ్, పారా మెడికల్, ఫార్మసీ, ల్యాబ్, ఆరోగ్యశ్రీ, పారిశుధ్యం, సెక్యూరిటీ తదితర విభాగాల్లో పనిచేసే వారితో పాటు సూపరింటెండెంట్, డీసీహెచ కార్యాలయాల ఉద్యోగులు చాలా మంది గతంలో ఆరోగ్య, ఇతర కారణాలతో టీకాలు వేయించుకోలేదు. కొందరు వైద్యులు కూడా టీకా వేయించుకోలేదని సమాచారం. ఇటీవల నియమించిన కొవిడ్ ప్రత్యేక వైద్య సిబ్బందికి కూడా మొదటి డోసు టీకాలు లేవు. నిత్యం బాధితుల మధ్య తిరగాల్సి రావడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాసుపత్రిలోని ఎంసీహెచ బ్లాకులో వ్యాక్సినేషన సెంటర్ ఉన్నప్పుడు ఉద్యోగులు, వైద్య సిబ్బంది ఏదో ఒక సమయంలో టీకాలు వేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దీనిని ఎత్తివేయడంతో ఫ్రంట్లైన వారియర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అప్పుడప్పుడు వ్యాక్సినేషన జరుగుతున్నా కేవలం రెండు రోజు మాత్రమే వేస్తున్నారని, తమకు వేయట్లేదని ఫ్రంట్లైన వారియర్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొందరు వైద్య సిబ్బంది కొవిడ్ బారిన పడడంతో వారికి వేతనంతో కూడిన 14 రోజుల హోం క్వారంటైన ఇవ్వడానికి అధికారులు టీకా మెలిక పెట్టారు. టీకా వేయించుకుంటేనే వేతనం ఇస్తామని, లేకుంటే లాస్ ఆఫ్ పే గా సెలవు తీసుకోవాలని స్పష్టం చేయడంతో ఫ్రంట్లైన వర్కర్స్కు పూర్తిస్థాయిలో టీకాలు అందని విషయం వెలుగు చూసింది. ప్రభుత్వాసుపత్రి కొవిడ్ ఆసుపత్రిగా మారిన నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న ఫ్రంట్లైన వారియర్స్ టీకాలు పడక ఆందోళన చెందుతున్నారు. అయితే, వైద్య సిబ్బంది ఎంత మంది టీకాలు వేయించుకున్నారు, ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు అనే లెక్కలు ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. వైద్యాధికారులు సమగ్ర వివరాలు సేకరించి తమకు వెంటనే మొదటి డోసు టీకాలు వేయించేలా చర్యలు తీసుకోవాలని ఫ్రంట్లైన వారియర్స్ జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.