పండ్ల దుకాణంలో..పాడైపోయిన ఆహారం
ABN , First Publish Date - 2020-06-02T10:06:17+05:30 IST
ఎలుకలు కొట్టేసిన బిస్కెట్స్.... మైనపు పూత పూసిన ఆపిల్స్... కాలం చెల్లి చెడిపోయిన ఊరగాయలు....
అధికారుల దాడుల్లో బహిర్గతం
ఏ-1 ఫ్రూట్స్ వ్యాపారికి నోటీసులు
నెల్లూరు (సిటీ), మే 1 : ఎలుకలు కొట్టేసిన బిస్కెట్స్.... మైనపు పూత పూసిన ఆపిల్స్... కాలం చెల్లి చెడిపోయిన ఊరగాయలు.... రసాయనాలు కలిపిన పండ్లు..... ఇవీ నెల్లూరు నగరంలోని మినీబైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఏ-1 ఫ్రూట్స్ దుకాణంలో వెలుగు చూసిన వింతలు. కార్పొరేషన్ ఆరోగ్య విభాగం అధికారులు సోమవారం ఏ-1 దుకాణాన్ని తనిఖీ చేశారు. బిస్కెట్ ప్యాకెట్లను ఎలుకలు కొట్టేసినట్లు, వాటిల్లో కొన్ని కాలం చెల్లినవి ఉన్నట్లు గుర్తించారు.
చెడిపోయి దుర్వాసన వస్తున్న ఊరగాయలు అమ్మకానికి ఉంచినట్లు తెలుసుకున్నారు. అలాగే పండ్లపై మైనం, రసాయనాలు ఉపయోగిస్తున్నారని గుర్తించారు. వాటన్నింటినీ నిర్వీర్యం చేసి డంపింగ్ యార్డుకు తరలించినట్లు ఎంహెచ్వో వెంకట రమణయ్య తెలిపారు. అనంతరం వ్యాపారికి నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరామని, తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు. నగరంలో ఏ దుకాణంలో అయినా ఇలాంటి ఆహార పదార్థాలుంటే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.