ఈ పండ్లను చూడగానే తినాలనుకుంటారు.. మరి వాటి ఆకుల్లోని గొప్పదనం తెలియకపోతే.. ఏం నష్టపోతారంటే..
ABN , First Publish Date - 2021-12-13T12:56:41+05:30 IST
శరీరానికి శక్తిని అందించడంలో..
శరీరానికి శక్తిని అందించడంలో పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పీచు పదార్థం శరీర అవసరాలను తీర్చడంతోపాటు, సహజసిద్ధమైన రీతిలో చక్కెరను మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతుంది. అయితే ఈ పండ్లు మాత్రమే కాదు, వాటి ఆకులు కూడా ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయని మీకు తెలుసా? ఏ పండ్ల ఆకులు మనకు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డైట్ హెర్బ్స్ ఇండియా ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శ్రీలలిత అవినాష్ ఈ వివరాలు తెలియజేశారు.
జామ ఆకులు
ఇందులో ఉండే పాలీఫెనాల్స్ కార్బోహైడ్రేట్లను నియంత్రిస్తాయి. జామ ఆకులతో చేసిన టీ.. రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. ఈ టీ డయేరియాను నయం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.
అరటి ఆకులు
ఎండిన అరటి ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అరటి ఆకుల పేస్ట్ను అప్లై చేయడం వల్ల మొటిమలు నయమవుతాయి. వింటర్ సీజన్లో చుండ్రును తొలగించడానికి, అరటి ఆకుల గుజ్జును జుట్టుకు పట్టించి, అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది.
దానిమ్మ ఆకులు
దానిమ్మ ఆకులను నమలడం వల్ల లూజ్ మోషన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో దానిమ్మ ఆకులను ఉడికించి, తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంపై దద్దుర్లు ఏర్పడినప్పుడు దానిమ్మ ఆకులను మెత్తగా రుబ్బి, ఈ పేస్ట్లో రోజ్ వాటర్ను కలిపి దద్దుర్లు ఉన్నచోటు రాస్తే అవి తగ్గుతాయి.
మామిడి ఆకులు
గొంతు నొప్పి ఉన్నవారు మామిడి ఆకులను ఉడకబెట్టి తాగితే ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా ఒక గ్లాసు నీటిలో మూడు నాలుగు మామిడి ఆకులను వేసి, బాగా మరిగించి, రాత్రంతా అలానేవుంచి ఉదయాన్ని తాగడం ద్వారా కడుపులో ఉండే ఇబ్బందికర సమస్యలు తొలగిపోతాయి.