జలాంతర్గాముల సామర్థ్యాన్ని పెంచే దిశగా డీఆర్డీఓ ముందడుగు..!
ABN , First Publish Date - 2021-03-11T02:39:44+05:30 IST
జలాంతర్గాముల సామర్థ్యాన్ని పోరాట పటిమను పంచే కొత్త సాంకేతికతను భారత్ రక్షణ రంగ పరిశోధన సంస్థ సోమవారం నాడు విజయవంతంగా పరీక్షించింది.
న్యూఢిల్లీ: జలాంతర్గాముల సామర్థ్యాన్ని, పోరాట పటిమను పెంచే కొత్త సాంకేతికతను భారత్ రక్షణ రంగ పరిశోధన సంస్థ సోమవారం నాడు విజయవంతంగా పరీక్షించింది. నేవీ సూచనల మేరకు ఏఐపీ(ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్స్) వ్యవస్థను ఎండ్యురెన్స్, మాక్స్ పవర్ మోడ్స్లో పరీక్షించగా..ఈ వ్యవస్థ అద్భుత పనితీరు కనబరిచింది. ఫ్యూల్ సెల్ ఆధారిత ఏఐపీ కారణంగా సబమెరైన్లు సుదీర్ఘకాలం పాటు నీటి అడుగున కొనసాగగలవని నిపుణులు చెబుతున్నారు. దీంతో..శత్రుదేశ సోనార్ వ్యవస్థలకు చిక్కుకుండా వాటిపై దాడి చేయగలవని అంటున్నారు. ఏఐపీ టెక్నాలజీ ప్రస్తుతం అతి కొద్ది దేశాల వద్ద మాత్రమే ఉంది. కానీ.. తాజాగా పరీక్షలు సఫలమవడంతో ఈ సాంకేతికత భారత వశమైంది. అయితే..ఇతర దేశాల కంటే భిన్నంగా భారత్ ఫ్యూల్ సెల్ ఆధారంగా ఏఐపీని అభివృద్ధి చేసింది. దీంతో.. జలాంతర్గామీలోనే హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. థెర్మ్యాక్స, ఎల్ అండ్ టీ సంస్థల సహకారంతో డీఆర్డీఓ ఈ విజయాన్ని సాధించింది. ఏఐపీ సాంకేతిక ఆశించిన సామర్థ్యం కనబర్చడంతో రక్షణ శాఖ మంత్రి డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.