అంత్యక్రియలకూ అవస్థలే
ABN , First Publish Date - 2021-05-12T05:48:42+05:30 IST
కరోనా బారినపడి మృతి చెందిన పేద, మధ్యతరగతి వ్యక్తుల అంత్యక్రియలు కూడా భారమయ్యాయి.
- పట్టించుకోని అధికార యంత్రాంగం
ఆత్మకూరు, మే 11: కరోనా బారినపడి మృతి చెందిన పేద, మధ్యతరగతి వ్యక్తుల అంత్యక్రియలు కూడా భారమయ్యాయి. ఆత్మకూరు హిందూ శ్మశానవాటికలో కాటికాపర్లు మృతుల కుటుంబాలకు చుక్కలు చూపిస్తున్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు కాటికాపర్లు భారీగా వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో రూ.2500 నుంచి రూ.3వేలు వసూలు చేసేవారు. ఇప్పుడు ఖననానికి గుంత తవ్వడానికి రూ.15వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. చివరకు రూ.10వేలకు అంగీకరిస్తున్నారు. నగర పాలక సంస్థ అధికారులు సహజ మరణానికి రూ.2200, కరోనా మరణమైతే రూ.5100 చొప్పున రుసుము తీసుకోవాలని శ్మశానంలో ధరల పట్టిక ఏర్పాటు చేశారు. కానీ అది అమలులోకి రావడం లేదని ఆత్మకూరువాసులు అంటున్నారు. అధికార యంత్రాంగం పట్టించుకోవాలని కోరుతున్నారు.