గాజువాకలో యువకుడు దారుణ హత్య
ABN , First Publish Date - 2022-01-24T06:26:53+05:30 IST
స్థానిక జగ్గు జంక్షన్ ప్రాంతంలోని గోపాలరెడ్డినగర్లో ఆదివారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బహిర్భూమికి వెళుతున్న అతడిని ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని కత్తితోపొడిచి, రాడ్తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి....
బహిర్భూమికి వెళుతుండగా కళ్లల్లో కారం చల్లి దాడి
కత్తితో పొడి, తలపై రాడ్తో కొట్టి హతమార్చిన దుండగులు
ఆర్థిక లావాదేవీతో దూరపు బంధువులే దారుణానికి ఒడిగట్టిన వైనం
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
గాజువాక, జనవరి 23: స్థానిక జగ్గు జంక్షన్ ప్రాంతంలోని గోపాలరెడ్డినగర్లో ఆదివారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బహిర్భూమికి వెళుతున్న అతడిని ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని కత్తితోపొడిచి, రాడ్తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి....
గోపాలరెడ్డినగర్ ప్రాంతానికి చెందిన సాత్రబోయిన ప్రసాద్(30) వెల్డర్గా కొంతకాలం గల్ఫ్ దేశాల్లో పనిచేశాడు. ఏడాది క్రితం తిరిగివచ్చి తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నారు. కాగా ఇంటిపక్కనే ఉంటున్న దూరపు బంధువులు గతంలో ప్రసాద్కి రూ.80 వేలు అప్పుగా ఇచ్చారు. ఎంతకాలమైనా తిరిగి ఇవ్వకపోవడంతో 15 రోజుల క్రితం ప్రసాద్తో వారు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ప్రసాద్ తన ఇంటికి సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో బహిర్భూమికి వెళ్లాడు. దూరపు బంధువులైన శ్రీను, పోతురాజు, చిన్న కలిసి ప్రసాద్ను అడ్డుకుని కళ్లల్లో కారం చల్లారు. వెంటనే కత్తితో పొడిచి, రాడ్తో తలపై పలుమార్లు గట్టిగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్ పెద్దగా కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. సమీపంలో వున్న కొంతమంది అక్కడకు చేరుకుని చూడగా ప్రసాద్ అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న తండ్రి చిలుకుబాబు, తల్లి రమణాజీ ఘటనా స్థలానికి చేరకుని భోరున విలపించారు. మరో నాలుగు రోజుల్లో దుబాయ్ వెళ్లాల్సిన తమ కుమారుడిని దారుణంగా హత్య చేశారంటూ కన్నీరుమున్నీరు అయ్యారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడీసీపీ రాజ్కమాల్, సీఐ హెచ్.మల్లేశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు సంబంధించి కుటుంబ సభ్యులను, స్థానికులను విచారించారు. మృతుడి తండ్రి చిలుకుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.