గాంధీ ఆశ్రమంలో నేతాజీకి ఘన నివాళి
ABN , First Publish Date - 2022-01-24T05:21:21+05:30 IST
పల్లెపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో కో-కన్వీనర్ నెల్లూరు రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సుభాష్చంద్రబోస్ (నేతాజీ) జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఇందుకూరుపేట, జనవరి 23 : పల్లెపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో కో-కన్వీనర్ నెల్లూరు రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సుభాష్చంద్రబోస్ (నేతాజీ) జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా కోర్ కమిటీ సభ్యులు జీవీ రామిరెడ్డి మహాత్మాగాంధీ, పొణకా కనకమ్మ విగ్రహాలకు ఖాదీ వస్త్రాలు, నూలు మాలలు సమర్పించారు. అనంతరం రవీంద్రరెడ్డి మాట్లాడుతూ భారత్కు ఆయుధాలతో పోరాటం తెలుసని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నతుడు, స్వాతంత్య్రం పోరాటం అహింసా మార్గంలోనే కాదు.. ప్రాణాలు పణంగాపెట్టి పోరాడుదామని పిలుపునిచ్చి మహావీరుడయ్యారని ఆయనకు ఘన నివాళి అర్పించారు. అనంతరం కోర్ కమిటీ సభ్యులు జీవీ రామిరెడ్డి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఈ ఏడాది నుంచి ‘పరాక్రమ్ దివస్’గా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకే కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు గంపల మంజుల, గణేశం సుమంత్రెడ్డి, పల్లిపాడు సర్పంచు రెడ్డిపోగు సుధాకర్, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో...
పొదలకూరు : స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో బోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ థైర్య సాహసాలు, ఆయన పట్టుదలను కొనియాడారు. అనంతరం దేశభక్తి గీతాలు ఆలపించారు. పిల్లలకు చాక్లెట్లు పంచి పెట్టారు.
నేతాజీ యువతకు స్ఫూర్తి
బుచ్చిరెడ్డిపాళెం : నేతాజీ సుభాష్ చంద్రబోస్ యువతకు స్ఫూర్తి అని జైహింద్ నినాదాన్ని జాతికి అందించిన మహనీయుడని కరస్పాండెంట్ నేలనూతల శ్రీధర్ అన్నారు. బుచ్చిలోని గోపాలకృష్ణయ్య స్కూల్లో ఆదివారం సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలను విద్యార్థుల నడుమ నిర్వహించారు. ముందుగా వారు నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు ఉపాఽధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.