పోలీసు నిఘాలో కుప్పం గంగ జాతర

ABN , First Publish Date - 2020-05-27T10:47:18+05:30 IST

ఏటా భక్త జన సందోహం మధ్య కోలాహలంగా జరిగే కుప్పం గంగ జాతర ఈ ఏడాది కరోనా కారణంగా భక్తులు లేకుండా పోలీసు ..

పోలీసు నిఘాలో కుప్పం గంగ జాతర

కుప్పం, మే 26: ఏటా భక్త జన సందోహం మధ్య కోలాహలంగా జరిగే కుప్పం గంగ జాతర ఈ ఏడాది కరోనా కారణంగా భక్తులు లేకుండా పోలీసు నిఘా నీడన జరిగింది. కేవలం పూజారి, పాలక మండలి సభ్యుల నడుమ నిరాడంబరంగా సంప్రదాయబద్దంగా జరిగింది. సోమవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత గంగమ్మ ఆలయంలో వెలసిన ముత్తుమారెమ్మ అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం సంప్రదాయ బద్ధంగా పూజారి గణ పర్యవేక్షణలో ఆలయ ఆవరణలోనే ప్రశాంతంగా జరిగిపోయింది. సాధారణంగా అయితే అగ్నిగుండ ప్రవేశం మరుసటి రోజున అమవారి శిరస్సును గ్రామ వీధుల్లో ఊరేగించి రాత్రికి అమ్మవారి మొండేనికి శిరస్సును అమర్చి, అమ్మవారి విశ్వరూప దర్శన భాగ్యం భక్తులకు కల్పించేవారు.


అయితే లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో డీఎస్సీ ఆరీఫుల్లా, కుప్పం రూరల్‌ సీఐ కృష్ణమోహన్‌, పుంగనూరు సీఐ గంగిరెడ్డిలు మంగళవారం గంగమ్మ ఆలయానికి వచ్చి పాలక మండలి చైర్మన్‌ పార్థసారథికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మంగళవారం జరగాల్సిన అమ్మవారి శిరస్సు ఊరేగింపు, విశ్వరూప దర్శన కార్యక్రమం రద్దైంది. భక్తులు తమ ఇళ్ల ఎదుటే అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారు జాము 2 గంటల మధ్యలో అమ్మవారి మొండేనికి శిరస్సు అమర్చడం, తిరిగి శిరస్సును నిమజ్జనం చేయడం వంటి కార్యక్రమాలు భక్తులెవరూ లేకుండా పోలీసు బందోబస్తు మధ్య నిర్ణయించారు. 

Updated Date - 2020-05-27T10:47:18+05:30 IST