అనుమతిలేకుండా గన్నర చెట్లు నరికివేత
ABN , First Publish Date - 2021-06-23T05:18:09+05:30 IST
గొలుగొండ మండలం సిహెచ్.నాగాపురం పంచాయతీ పరిధిలోని కుమారపురంలో అనుమతులు లేకుండా గన్నర చెట్లు నరికివేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.
అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు
సిబ్బంది పరిశీలన... 13 దుంగలు స్వాధీనం
కృష్ణాదేవిపేట, జూన్ 22: గొలుగొండ మండలం సిహెచ్.నాగాపురం పంచాయతీ పరిధిలోని కుమారపురంలో అనుమతులు లేకుండా గన్నర చెట్లు నరికివేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. దీనిపై గొలుగొండ సెక్షన్ అధికారి లక్ష్మణరావు మాట్లాడుతూ, కుమారపురం శివారులోని ఒక జీడిమామిడి తోటలో 13 గన్నర చెట్ల దుంగలు తరలింపునకు సిద్ధంగా వున్నాయని కుమారపురం గ్రామానికి చెందిన రేగుబళ్లు సాంబశివరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని చెప్పారు. డీఎఫ్వో ఆదేశాల మేరకు కొయ్యూరు, గొలుగొండ సెక్షన్ల పరిధిలోని గార్డులు గంగరాజు, పొట్టన్న మరికొంతమంది సిబ్బందితో వెళ్లి పరిశీలించగా 13 గన్నర చెట్లు నరికివేసినట్టు కనిపించిందన్నారు. ఒక్కొక్క చెట్టును రెండు మూడు ముక్కలుగా నరికారని, అక్కడ 16 దుంగలు వుండడంతో వాటికి కొలతలు తీసి, నంబర్లు వేశామన్నారు. మరికొన్ని ముక్కలను తరలించి వుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు .