గరుడ వారధి.. ఇక ‘శ్రీనివాస సేతు’
ABN , First Publish Date - 2021-08-18T06:08:19+05:30 IST
తిరుపతి స్మార్ట్..
పేరు మారుస్తూ తీర్మానం చేసిన కౌన్సిల్
కార్పొరేషన్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆందోళన
తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుపతి స్మార్ట్ సిటీ, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న గరుడ వారధి పేరును ‘శ్రీనివాస సేతు’గా మార్చారు. ఈ మేరకు మంగళవారం జరిగిన తిరుపతి కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్అఫిషియో సభ్యుడైన ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రకటించారు. దీనిపై టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే గరుడ వారధిగా గుర్తింపు తెచ్చుకుందని, అదే పేరును కొనసాగించాలని మేయరు పోడియం వద్దకెళ్లి గోవింద నామస్మరణలతో వేడుకున్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు పెట్టిన పేరును కొనసాగించాల్సిన అవసరం తమకు లేదని భూమన అన్నారు. కొత్త పేరునే అధికారికంగా కౌన్సిల్ తీర్మానం చేస్తోందన్నారు. ఎమ్మెల్మేతో పాటు పలువురు సభ్యులు వాదించడంతో ఆర్సీ మునికృష్ణ నిరసన తెలుపుతూ కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేశారు.
‘గరుడ వారధి’ పేరే ఉంచండి
సీఎంగా చంద్రబాబు నాయుడు తిరుపతి ఫ్లైఓవర్కు యుద్ధప్రాతిపదికన అనుమతులిచ్చి గరుడ వారధిగా ప్రాచుర్యంలోకి వస్తే.. నాలుగేళ్ల తర్వాత పేరు మార్చడం ఏమిటని టీడీపీ నేతలు మండిపడ్డారు. కౌన్సిల్ తీర్మానం విషయం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు నరసింహ యాదవ్, శ్రీధర్వర్మ తదితరులు కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకుని కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణతో కలిసి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు గరుడ వారధి పేరును తీసేయడం ఒక నిదర్శనమన్నారు. చంద్రబాబు ముద్రలు చెరిపేయాలన్న దురుద్దేశంతో అందరికీ గరుడ వారధి పేరును మారుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గరుడ వారధి మీద వాహనాలు వెళితే శ్రీవారి వాహనంపై వెళ్లినట్లని కొత్త భాష్యం చెబుతున్నారని, శ్రీనివాసుడిపై వెళితే అపవిత్రం కాదా? అనిప్రశ్నించారు. అలాగైతే గరుడాద్రి ఎక్స్ప్రెస్, గురుడాద్రి గృహసముదాయాల పేర్లూ మార్పిస్తారా అని నిలదీశారు. వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే గరుడ పేరును కొనసాగించాలని డిమాండు చేశారు. ఈ ఆందోళనలో ఊట్ల సురేంద్ర నాయుడు, ఆనంద్బాబు, మునిరామయ్య, సింధూజ, మైనం బాలాజీ, రుద్రకోటి సదాశివం, మనోహరాచారి, రాజయ్య, జయరాం రెడ్డి, మహేష్ యాదవ్, హేమంత్ రాయల్, కేవీ రమణ, సుధాకర్ రెడ్డి, నాగరాజు, రవితేజ నాయుడు, వెంకీ, మోహన్ రాయల్, మధు చంద్ర, వంశీ, సుబ్రమణ్యం నాయుడు, జ్ఞానశేఖర్ తదితరులు పాల్గొన్నారు.