HYD : పండుగకు పస్తులేనా.. వారం రోజులుగా Gas డెలివరీ బంద్‌..!

ABN , First Publish Date - 2021-10-09T16:55:23+05:30 IST

పండుగ వేళ గ్యాస్‌ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు...

HYD : పండుగకు పస్తులేనా.. వారం రోజులుగా Gas డెలివరీ బంద్‌..!

  • పట్టించుకోని అధికారులు
  • దురుసుగా ప్రవర్తిస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు

హైదరాబాద్ సిటీ/మన్సూరాబాద్‌ : పండుగ వేళ గ్యాస్‌ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు వారం రోజులుగా సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. దాంతో పండుగకు పస్తులు ఉండాల్సిందేనా అని వినియోగదారులు మండిపడుతున్నా రు. మన్సూరాబాద్‌ విశాలాంధ్ర కాలనీలో ఉన్న శ్రీహైందవీ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు ఆదివారం నుంచి సిలిండర్లు సరఫరా చేయటంలేదు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నా డోర్‌ డెలివరీ చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోన్నారు. సదరు ఏజెన్సీకి సుమారు 15వేల కనెక్షన్లు ఉన్నాయి. 


వారం రోజులలో సుమారు 2వేల మంది ఆన్‌లైన్‌లో సిలిండర్లు బుక్‌ చేసుకున్నారు. వారంతా రోజూ ఏజెన్సీ కార్యాలయం చుట్టూ తిరుగుతోన్నారు. అక్కడి సిబ్బందిని సంప్రదించగా వారు దురుసుగా మాట్లాడుతున్నారన్న ఫిర్యాదులు వస్తోన్నాయి. ఇక ఏజెన్సీ నిర్వాహకులు వారం రోజుల నుంచి పత్తాలేకుండా పోయారు. అయితే డోర్‌ డెలివరీ చేసే ఆటో డ్రైవర్లలో కొందరిని తొలగించడంతోనే మిగతా వారు కూడా సమ్మె చేయడం వల్ల సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోవటంపై విమర్శలు వస్తోన్నాయి. ఈ విషయంపై సివిల్‌ సప్లై అధికారిణి బాలసరోజను సంప్రదించగా.. ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడానని, శనివారం వరకు సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు.


సమస్యలు పరిష్కరించాలి.. 

తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్యాస్‌ డెలి వరీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్‌ సదుపాయం కల్పించటంలేదని, ఇదేమని అడిగితే నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతూ అడిగితే విధుల నుంచి తొలగిస్తున్నారని అసోసియేషన్‌ ప్రతినిధులు ఆరోపించారు. ఎల్‌బీనగర్‌ పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి చంద్రయ్యగౌడ్‌, ఉపాధ్యక్షుడు నర్సింగ్‌, సహాయ కార్యదర్శులు కుమార్‌, లాలు, జగతయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-09T16:55:23+05:30 IST