కేంద్రంతో మాట్లాడండి ప్లీజ్.. ఆక్సిజన్ కొరతపై రాజస్థాన్ ఎంపీలకు సీఎం విజ్ఞప్తి..
ABN , First Publish Date - 2021-04-23T01:08:04+05:30 IST
కొవిడ్ రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ కొరతపై కేంద్రంతో ‘‘సీరియస్’’గా మాట్లాడాలంటూ రాష్ట్రానికి ...
జైపూర్: కొవిడ్ రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ కొరతపై కేంద్రంతో ‘‘సీరియస్’’గా మాట్లాడాలంటూ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. ట్విటర్ వేదికగా ఆయన ఈ మేరకు ఎంపీలకు పిలుపునిచ్చారు. ‘‘మందులు, ఆక్సిజన్, వ్యాక్సీన్ల కొరతను అధిగమించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకునేందుకు పార్లమెంటు సభ్యులంతా ముందుకు రావాలి. ఏప్రిల్ 30 నాటికి కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతుందని నిపుణులు చెబుతున్నందున మందుల కొరత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి..’’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై చర్చించేందుకు ఇవాళ ఆయన అత్యవసర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా తమ వద్ద మరో 45 నిమిషాలకు మాత్రమే ఆక్సిజన్ సరిపోతుందనీ... రోగుల ప్రాణాలు కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ హర్యానాలోని ఫోర్టిస్ ఆస్పత్రి ట్వీట్ చేసింది. రాజస్థాన్, హర్యానా ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, పియూష్ గోయల్, రాజ్నాథ్ సింగ్లను ట్యాగ్ చేసింది.