అమెరికా ఆర్మీ చీఫ్తో జనరల్ నరవనే చర్చలు
ABN , First Publish Date - 2021-05-12T23:22:53+05:30 IST
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే ఇవాళ అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ జేమ్స్ సి మెక్కాన్విల్లేతో ఫోన్లో మాట్లాడారు....
న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే ఇవాళ అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ జేమ్స్ సి మెక్కాన్విల్లేతో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక సైనిక సహకారంతో పాటు కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురూ ప్రధానంగా చర్చించారు. ప్రాంతీయ భద్రతా పరిణామాల నేపథ్యంలో భారత, అమెరికా సైన్యాల మధ్య సహకారంపై జనరల్ ఎంఎం నరవనే, జనరల్ మెక్కాన్విల్లే చర్చలు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా భారత-అమెరికా సైన్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్లో భారత, అమెరికా సైనిక సహకారానికి మరింత ఊతమిచ్చేలా ఇరుదేశాలు బీఈసీఏ (బేసిక్ ఎక్స్చేంజ్, కోపరేషన్ అగ్రమెంటు) ఒప్పందంపై సంతకాలు పెట్టాయి. దీనికంటే రెండేళ్ల ముందు సీవోఎంసీఏఎస్ఏ (కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ, భద్రతా ఒప్పందం)పై సంతకాలు చేశాయి. ఇరు సైన్యాల మధ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, అమెరికా నుండి మన దేశానికి అత్యాధునిక సాంకేతికతను కొనుగోలు చేయడానికి ఈ ఒప్పందం జరిగింది. భారత్తో రక్షణ వాణిజ్యాన్ని, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు అమెరికా 2016లో భారత్ ‘‘ప్రధాన రక్షణ భాగస్వామి’’గా గుర్తించింది. 2016లో ఇరుదేశాలూ లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ అవగాహన ఒప్పందం (ఎల్ఈఎంఓఏ)పై కూడా సంతకాలు చేశాయి. దీనికింద ఇరు సైన్యాలు రక్షణ పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణతో పాటు మరింత లోతైన సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి.