ఇళ్ల స్థలాలకు జియో ట్యాగింగ్
ABN , First Publish Date - 2021-03-01T06:46:54+05:30 IST
ఇళ్ల స్థలాలకు జియో ట్యాగింగ్
విజయవాడ రూరల్, ఫిబ్రవరి 28 : పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మండలంలోని పలు గ్రామాలలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. గ్రామ సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్స్ ద్వారా గ్రామాలలో జియో ట్యాగింగ్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. దీంతో నున్న, పాతపాడుకు ఇళ్ల స్థలాల లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నా రు. నున్నలో నున్న, అంబాపురం, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి గ్రామాలకు చెందిన వారికి స్థలాలను పంపిణీ చేశారు. జియో ట్యాగింగ్ కోసం లబ్ధిదారులు ఆటోలలో నివేశన స్థలాలకు వస్తున్నారు. దీంతో ఇది తమకు భారంగా ఉంటోందని లబ్ధిదారులు వాపోతున్నారు. నున్న నుంచి ఇళ్ల స్థలాలు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉండటమే కారణమంటున్నారు. ఇదిలావుండగా, ఇళ్ల ప్లాట్ల నంబరింగ్ ప్రకారం జియో ట్యాగింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు అధికారులు వివరించారు.