నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ది నరహత్యే..
ABN , First Publish Date - 2020-06-02T19:07:23+05:30 IST
జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది.
వాషింగ్టన్ డీసీ: జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. దీంతో అమెరికా నల్లజాతి నిరసనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. మే 25న శ్వేతజాతి పోలీసుల చేతిలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు చనిపోవడంతో అగ్రరాజ్యంలో నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. నల్లజాతీయులు ఏకంగా తమ ఆందోళనలతో శ్వేతసౌధాన్ని కూడా ముట్టడించారు. ఇలా యూఎస్లో జాత్యహంకారంపై జనాగ్రహం కట్టలుతెంచుకుంటున్న ప్రస్తుత సమయంలో ఫ్లాయిడ్కు సంబంధించిన కీలకమైన అధికారిక పోస్ట్మార్టం నివేదిక వెలువడింది.
ఫ్లాయిడ్ మెడపై బలమైన ఒత్తిడి వలన ఆక్సిజన్ అందక మృతిచెందాడని, ఇది నరహత్య అని మిన్నెపోలిస్లోని హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. మెడపై ఒత్తిడి కారణంగా మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోవంతో చనిపోయాడని పరీక్షల్లో తేలింది. అంతేగాక ఫ్లాయిడ్ ఇటీవలి "మెథాంఫేటమిన్" వాడకం,"ఫెంటానిల్ మత్తు", రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి కూడా అతని మరణానికి కారణమయ్యాయని యూఎస్ వైద్య పరీక్షల కార్యాలయం వెల్లడించింది.
ఇక గత సోమవారం జార్జి ఫ్లాయిడ్ను అదుపులోకి తీసుకునే క్రమంలో శ్వేతజాతి పోలీస్ అధికారి డెరెక్ ఛౌవిన్ అతని మెడపై మోకాలితో బలంగా నొక్కడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నిరాయుధుడైన ఫ్లాయిడ్ మృతికి పోలీసులే కారణమంటూ నల్లజాతీయులు చేపట్టిన ఆందోళనలతో ప్రస్తుతం అగ్రరాజ్యం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.