ఎక్కడో పుట్టి.. ఇక్కడి బాధలకు స్పందించి..
ABN , First Publish Date - 2021-05-29T08:42:50+05:30 IST
భారత్లో స్థిరపడిన ఓ జర్మనీ హాకీ క్రీడాకారిణి కరోనాపై పోరులో తమ వంతు సహకారం అందిస్తున్నది. చేసేది చిన్న వ్యాపారం..
గోవా: భారత్లో స్థిరపడిన ఓ జర్మనీ హాకీ క్రీడాకారిణి కరోనాపై పోరులో తమ వంతు సహకారం అందిస్తున్నది. చేసేది చిన్న వ్యాపారం..అందునా కొవిడ్ వేళ బిజినెస్ అంతంత మాత్రంగానే సాగుతున్నా ‘ఉన్న దాంట్లో కొంత’ అన్న చందాన చేయూతనిస్తూ ప్రశంసలు అందుకుంటున్నది. ఆమె పేరు ఆండ్రియా తుమ్షిర్న్. జర్మనీకి చెందిన ఆండ్రియా క్లబ్ స్థాయి హాకీ క్రీడాకారిణి. క్రీడల ద్వారా భారత్లో చిన్నారులను చదువువైపు మళ్లించాలనే మహత్తర సంకల్పంతో 2017తో భర్తతో కలిసి భారత్ వచ్చి ‘హాకీ విలేజ్ ఇండియా’ అనే ప్రాజెక్ట్ చేపట్టింది. కానీ రాజస్థాన్లోని రెండు గ్రామాల్లో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ అక్కడి వ్యక్తుల అవినీతివల్ల మూలనపడింది. దాంతో ఆండ్రియా దంపతులు కర్ణాటకలోని కూర్గ్ వచ్చి చిన్న వ్యాపారం ప్రారంభించారు.
అది కూడా క్లిక్ అవలేదు. జీవన భృతికోసం పుణెలో ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఎందుకో..అక్కడా వారు ఇమడలేకపోయారు. చివరగా గోవా వచ్చి బేకరీని ప్రారంభించారు. ఇందుకు జర్మనీ ప్రభుత్వం కూడా సహకరించింది. అయితే కరోనాతో ఏడాదిగా ఆ వ్యాపారమూ అంతంతమాత్రంగానే సాగుతోంది. ప్రస్తుతం కొవిడ్ రెండో వేవ్ విపత్కర పరిస్థితులతో చలించిన ఆండ్రియా దంపతులు తమకు తోచిన విధంగా సమాజ సేవ చేయాలని భావించారు. కరోనాపై పోరులో అలుపెరగక శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి సాయం చేయాలని నిర్ణయించారు. తమ బేకరీ ఉత్పత్తులు రెండు వెరైటీలను ప్యాక్ చేసి స్థానిక ఓ ఆసుపత్రిలోని 50మంది సిబ్బందికి రోజూ అందజేస్తుండడం విశేషం. ‘మా తరపున ఇదో చిన్న సాయం’ అని ఆండ్రియా చెప్పింది.