అన్నవరం సిద్ధం
ABN , First Publish Date - 2020-06-02T09:18:19+05:30 IST
ప్రార్థనా మందిరాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రముఖ పుణ్య క్షేత్రమైన సత్యదేవుని
ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూపు
అన్నవరం, జూన్ 1: ప్రార్థనా మందిరాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రముఖ పుణ్య క్షేత్రమైన సత్యదేవుని ఆలయాన్ని తెరిచేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఖరారు కాకపోయినా ప్రాథమిక జాగ్రత్తలు చేపడుతున్నారు. రాజగోపురం సమీపంలో కరోనా నిరోధక కేంద్రాన్ని నెలకొల్పారు. దీనిగుండా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అక్కడ చేతులు శుభ్రపరుచుకునేందుకు నీటి పైపులైను పెట్టారు. భక్తుడికి, భక్తుడికి మధ్య రెండు మీటర్ల దూరం ఉండేలా సర్కిల్స్ గీసి మార్కింగ్ చేశారు. అన్నదానంలో సహపంక్తి భోజనాలు లేకుండా ప్యాకింగ్ ద్వారా అన్నప్రసాదం అందించాలని ఆలోచన చేస్తున్నారు.
కొండ దిగువున థర్మల్ స్ర్కీనింగ్ యంత్రాలు ఏర్పాటుచేసి పరీక్షల అనంతరం కొండపైకి పంపడానికి నిర్ణయించారు. ఒక్కో వ్రత మండపంలో కేవలం 20 వ్రతాలు మాత్రమే నిర్వహించాలని యోచిస్తున్నారు. వీటన్నిటితో కూడిన నివేదిక తయారు చేసి దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తామని ఈవో త్రినాథరావు తెలిపారు. కాగా దేవదాయ శాఖ అధికారులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.