మమతా బెనర్జీకి బూస్ట్.. టీఎంసీలో చేరిన గోవా ఫార్వార్డ్ పార్టీ చీఫ్

ABN , First Publish Date - 2021-11-21T00:46:12+05:30 IST

గోవాలో జెండా పాతేందుకు ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ

మమతా బెనర్జీకి బూస్ట్.. టీఎంసీలో చేరిన గోవా ఫార్వార్డ్ పార్టీ చీఫ్

కోల్‌కతా: గోవాలో జెండా పాతేందుకు ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలకు మరింత ఊపు వచ్చింది. మాజీ ఎమ్మెల్యే, గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు కిరణ్ కండోలక్కర్ పార్టీలో తన ర్యాంకును వదులుకుని మరీ భార్య కవిత కండోల్కర్‌తో కలిసి శనివారం టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అసమ్మతి వర్గానికి చెందిన మరో 40 ఆఫీస్ బేరర్లు, స్థానిక నేతలు టీఎంసీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.


వీరిని ఎంపీ మహువా మొయిత్రా, టీఎంసీ జాతీయ ఉపాధ్యక్షుడు లుయిజినో ఫలేరో పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జీఎఫ్‌పీ పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కిరణ్ అందులో భాగంగా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.


గోవాలో టీఎంసీ రోజురోజుకు బలపడుతోంది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. గోవా మాజీ ముఖ్యమంత్రి లుయిజినో ఫలేరో సెప్టెంబరులో కాంగ్రెస్‌ను వీడి టీఎంసీలో చేరారు. ఆ తర్వాత నెల రోజుల్లోపే ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష పదవి లభించింది. టెన్సిస్ ఆటగాడు లియాండర్ పేస్, నటి నఫీసా అలీ, వ్యాపారవేత్త మృణాళిని దేశ్‌ప్రభు తదితరులు అక్టోబరులో మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. 

Updated Date - 2021-11-21T00:46:12+05:30 IST