కుటుంబ సభ్యులకు తెలియకుండా.. కొవిడ్ మృతుని ఖననం
ABN , First Publish Date - 2020-08-14T14:53:34+05:30 IST
కొవిడ్ బారిన పడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు చనిపోయినా..
ఆస్పత్రికి వచ్చి లబోదిబోమన్న కుమారుడు
జీజీహెచ్(కాకినాడ): కొవిడ్ బారిన పడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు చనిపోయినా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. కాకినాడ సాంబమూర్తినగర్ ఐదో వీధికి చెందిన వృద్ధుడు (70)కు కొవిడ్ నిర్ధారణ కావడంతో జీజీహెచ్లో ఈ నెల 9న చేర్పించారు. 10న అర్జునరావు కుమారుడు ఏసు తండ్రిని చూసి వచ్చాడు. గురువారం మళ్లీ చూడడానికి వెళ్లగా తండ్రి దుస్తుల సంచి ఉంది. ఆ బెడ్పై మరో బాధితుడు ఉన్నాడు. అక్కడ సిబ్బందిని ఏసు తండ్రి గురించి వాకబు చేయగా చనిపోయాడని సమాధానమిచ్చారు. అయితే ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడంపై ఏసు ఆవేదన వ్యక్తం చేశాడు. మార్చురీ వద్దకు వెళ్లి తండ్రి ఆచూకీ కోసం ప్రయత్నించగా అక్కడ ఉన్న 12 మృత దేహాల్లో అర్జునరావు పేరు గల బాడీ లేదని సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం ఏసు దిక్కుతోచని పరిస్థితిలో తండ్రి ఆచూకీ కోసం లబోదిబోమంటున్నాడు.
ఖననం చేశాం..
వృద్ధుడు ఈ నెల 10న చనిపోయాడని అయితే కుటుంబ సభ్యులు సరైన వివరాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. అందుకు సమాచారం ఇవ్వలేక పోయామన్నారు. రెండు రోజులు చూసి 12న మున్సిపల్ సిబ్బంది ఖననం చేశారన్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని చూపిస్తామని చెప్పారు.