టెన్షన్.. టెన్షన్..
ABN , First Publish Date - 2020-12-04T12:46:09+05:30 IST
గ్రేటర్ పోలింగ్ ముగిసినా ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ తగ్గడం లేదు. ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 18 సంవత్సరాల తర్వాత బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ ..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్ పోలింగ్ ముగిసినా ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ తగ్గడం లేదు. ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 18 సంవత్సరాల తర్వాత బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ జరగడంతో ఓట్ల లెక్కింపు కొంత ఆలస్యం కానుంది. తమకే స్పష్టమెన మెజార్టీ వస్తుందంటూ పలు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తం 150 డివిజన్లలో 110 డివిజన్లలో 50 శాతం కంటే తక్కువ ఓటింగ్ జరగడం ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. పార్టీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతమంది అభ్యర్థులు విజయంపై ధీమాతో సంబరాల ఏర్పాట్లలో ఉన్నారు.
ఓడితే అంతే..
పోలింగ్ రోజు నుంచే అభ్యర్థులు పోలైన ఓట్లు....తమకు పట్టున్న ప్రాంతాల్లో పోలైన ఓటింగ్ లెక్కలు తీస్తూ గెలుపు ఓటములను బేరీజు వేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని, ఓడితే ఇక అంతేనని కొంతమంది నేతలు తమ అనుచరులతో చర్చిస్తున్నారు. ఎన్నికలు ముగిసినా స్థానికంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయాల్లో క్షేత్రస్థాయి నాయకుల సందడి కనిపిస్తోంది. కౌంటింగ్ను పురస్కరించుకుని ఇప్పటికే ఏజెంట్లను నియమించుకున్న పార్టీల అభ్యర్థులు ఒక్కో ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని వారికి సూచించారు.