తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, 15 ఎంపీ సీట్లు సాధిస్తాం: ధర్మపురి అర్వింద్
ABN , First Publish Date - 2020-12-04T22:54:44+05:30 IST
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఫలితాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్ధమౌతోందని చెప్పారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఫలితాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్ధమౌతోందని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, టీఆర్ఎస్ అధినాయకత్వంలో అహంకారం పతాక స్థాయికి చేరిందన్నారు. అందుకే ప్రజలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాకిచ్చారని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు తాజా ఫలితాలే నిదర్శనమన్నారు. మోదీపై, బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి భయం పట్టుకుందన్నారు.
దుబ్బాకలో బీజేపీ గెలవడంతో 2021 మార్చ్లో జరగాల్సిన జీహెచ్ఎంసీ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రభుత్వం మూడు నెలలు ముందుగానే నిర్వహించిందని అర్వింద్ ఎద్దేవా చేశారు. బీజేపీ వల్లే కేసీఆర్లో భయం మొదలైందని చెప్పారు. సిరిసిల్లలో కేటీఆర్ను ఓడిస్తామని చెప్పారు. ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణలో బీజేపీ అవినీతి రహిత పాలన అందించగలదని అర్వింద్ చెప్పారు. సెక్రటేరియట్కు ఏడేళ్లుగా పోని కేసీఆర్ రాష్ట్రంలో రైతులను, మైనార్టీలను, మహిళలను, దళితులను మోసం చేశారని అర్వింద్ ఆరోపించారు. 2023లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 15 లోక్సభ సీట్లు గెలిచి మోదీకి గిఫ్ట్గా ఇస్తామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.