అప్పు కోసం GHMC తిప్పలు.. బ్యాంకులతో చర్చలు.. ఇప్పటికే వేల కోట్ల రుణభారం!

ABN , First Publish Date - 2021-10-21T14:27:25+05:30 IST

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్‌ఎంసీ ..

అప్పు కోసం GHMC తిప్పలు.. బ్యాంకులతో చర్చలు.. ఇప్పటికే వేల కోట్ల రుణభారం!

  • ఇంపాక్ట్‌ రుసుం ఆదాయ వనరుగా చూపించి..
  • ఇప్పటికే వేల కోట్ల రుణభారంతో సంస్థ
  • ఎస్‌ఎన్‌డీపీ కోసం రూ.500 కోట్లు తీసుకునే యోచన

హైదరాబాద్‌ సిటీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్‌ఎంసీ మరో ప్రాజెక్టు కోసం రుణం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పలు బ్యాంకులతో ఆర్థిక విభాగం అధికారులు చర్చలు జరుపుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు నిధుల కొరత నేపథ్యంలో అప్పు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రేటర్‌లో వరద నీటి కష్టాలకు చెక్‌ పెట్టేలా.. నాలాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఎన్‌డీపీ) పే రిట ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. రూ.858 కోట్లతో చేపట్టే మొదటి దశ పనులకు సర్కారు పాలనా పరమైన అనుమతులూ జారీ చేసింది. పలు చోట్ల పనులకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ పూర్తి కాగా.. కొన్ని జోన్లలో బిడ్‌లు దాఖలు కాకపోవడంతో.. తిరిగి నోటిఫికేషన్‌ ప్రకటిస్తున్నారు. కాగా.. ప్రాజెక్టుకు నిధులు లేకపోవడంతో రుణం తీసుకోవాలని తాజాగా జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.


ఇంపాక్ట్‌ ఫీ ఆదాయ వనరుగా...

నగరంలో వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుపర్చేందుకు నాలాలను అభివృద్ధి/విస్తరణకు రూ.10 వేల కోట్లు కావాలి. అంత మొత్తం ఒకేసారి వెచ్చించడం దాదాపు సాధ్యం కాని నేపథ్యంలో దశల వారీగా పనులు చేస్తున్నా రు. ప్రభుత్వం నిధులిచ్చే పరిస్థితి లేకపోవడంతో స్వీయ ఆర్థిక వనరుల ద్వారా అవసరమైన మొత్తాన్ని సమీకరించేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. అప్పు తీసుకునే క్రమంలో వివిధ బ్యాంకుల ప్రతినిధులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. కనీసం రూ.500 కోట్లు రుణంగా తీసుకోవాలని భావిస్తున్నట్టు ఆర్థిక విభాగం వర్గాలు తెలిపాయి. పురపాలక శాఖ ఇటీవల ప్రకటించిన వాణిజ్య కారిడార్లలో భవన నిర్మాణ అనుమతుల జారీ క్రమంలో వసూలు చేసే ఇంపాక్ట్‌ ఫీని ఎస్‌ఎన్‌డీపీ పనుల కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ రూపేణా యేటా రూ.120-150 కోట్ల వరకు వసూలు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇంపాక్ట్‌ ఫీని ఆదాయ వనరుగా చూపి రుణం తీసుకోనున్నారు. ఆదాయ వనరులేంటి..? ఇంపాక్ట్‌ ఫీ అంటే ఏంటి..? ఎంత మేర వచ్చే అవకాశముందో స్పష్టంగా వివరాలు ఇవ్వాలని బ్యాంకుల ప్రతినిధులు చెప్పినట్టు తెలిసింది.


వేల కోట్ల అప్పు...

జీహెచ్‌ఎంసీ అప్పుల పాలైంది. వస్తోన్న ఆదాయం కంటే ఖర్చులు పెరగడంతో సంస్థ రుణాల బాట పట్టింది. ఇప్పటికే ఎస్‌ఆర్‌డీపీ కోసం మునిసిపల్‌ బాండ్ల ద్వారా రూ.495 కోట్లు, రూ.2500 కోట్ల రూపీ టర్మ్‌ లోన్‌ తీసుకున్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహాల కోసం హడ్కో నుంచి రూ.150 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఎస్‌ఎన్‌ డీపీ  కోసం ఇప్పుడు రూ.500 కోట్లు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2021-10-21T14:27:25+05:30 IST