ఆన్లైన్లో కానుకలు
ABN , First Publish Date - 2021-05-14T04:46:57+05:30 IST
కొవిడ్-19 విపత్కర పరిస్థితిలో దేవదాయ శాఖ ఆదాయం పెంచుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ-హుండీలను అమలు చేస్తోంది. భక్తుల నుంచి నేరుగా ఆన్లైన్లో ఆలయాల ఖాతాలకు కానుకలు.. మొక్కుబడులకు చెందిన డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంది. ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం వచ్చే దేవాలయాలన్నింటికీ ఈ అవకాశం కల్పించింది.
అమలులోకి ఈ-హుండీలు
దేవదాయ శాఖ చర్యలు
శృంగవరపుకోట, మే 13: కొవిడ్-19 విపత్కర పరిస్థితిలో దేవదాయ శాఖ ఆదాయం పెంచుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ-హుండీలను అమలు చేస్తోంది. భక్తుల నుంచి నేరుగా ఆన్లైన్లో ఆలయాల ఖాతాలకు కానుకలు.. మొక్కుబడులకు చెందిన డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంది. ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం వచ్చే దేవాలయాలన్నింటికీ ఈ అవకాశం కల్పించింది. కరోనా వైరస్ వ్యాప్తితో గత ఏడాది మార్చి నెల నుంచి చిన్న ఆలయాలతో పాటు పెద్ద పెద్ద దేవాలయాలకు భక్తులు రాకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. భగవంతుడిని దర్శించుకొనేందుకు భక్తులు వచ్చేసమయంలో ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరించే ప్రమాదం ఉండడంతో అధికారులు గత నవంబర్ వరకు ఆలయాలన్నింటినీ మూసేశారు. దీంతో ఆదాయానికి గండిపడింది. ఆ తరువాత గుడి తలుపులు తెరిచినప్పటికీ పలు రకాల ఆంక్షలు విధించడంతో భక్తుల రాక అరకొరగానే ఉండేది. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో ప్రభుత్వం ఉదయం 6 నుంచి 11గంటల వరకే దేవాలయాల్లోకి ప్రవేశం కల్పిస్తోంది. మాస్కు, భౌతిక దూరం, శానిటైజర్ వంటి నియమనిబంధనలతో స్వామి దర్శనానికి భక్తులు అంతగా ఆసక్తి చూపడం లేదు. మొక్కుబడులు తప్పక తీర్చాలన్న బలమైన కోరిక ఉన్న వారు మాత్రమే ఈ సమయంలో వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా భక్తుల రాక తగ్గడంతో హుండీలో మొక్కుబడులు, కానుకలు పడడం లేదు. దీంతో దేవదాయ శాఖ నిధుల సమస్యను ఎదుర్కోంటోంది. ఆలయాల అభివృద్ధి మాట అటుంచి ఉద్యోగులు, సిబ్బంది జీత భత్యాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేవదాయ శాఖ ఈ-హుండీ పథకాన్ని రూపొందించింది. దేవాలయాల నిర్వహణకు అవస్థలు పడకుండా ఉండేందుకు ఈ విధంగా ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తోంది. భక్తులు ఆలయానికి రాకుండానే తమకు నచ్చిన స్వామి వారికి ఆన్లైన్లో మొక్కులు, కానుకలు సమర్పించవచ్చు. ఇందుకోసం దేవదాయశాఖ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎంఎస్.ఏపీ.ఇన్ అనే వెబ్సైట్ను రూపొందించింది. భక్తులు వెబ్సైట్ ద్వారా ఆలయాల బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ ద్వారా ఇ-హుండీలకు డబ్బులు పంపవచ్చు. ఈ విధానం ఎంతవరకు లాభిస్తుందో చూడాలి.