గంగలో అనుమానాస్పద బాక్సు... దానిని తెరచి ఆవాక్కయిన గ్రామస్తులు!
ABN , First Publish Date - 2021-06-16T14:00:05+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.
ఘాజీపూర్: ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఒక తల్లి తన బిడ్డను చెక్కపెట్టెలో ఉంచి గంగానదిలో పడేసింది. ఆమె ఆ బాక్సులో దేవతా పఠాన్ని కూడా ఉంచింది. అనుమానాస్పదంగా కనిపించిన ఈ పెట్టెను తెరిచిన గ్రామస్థులు అవాక్కయ్యారు. పెట్టెలో ఆ శిశువు సజీవంగానే ఉంది. ఈ ఉదంతం ఘాజీపూర్ పరిధిలోని దాద్రీఘాట్లో చోటుచేసుకుంది. గంగలో తేలుతున్న చెక్కపెట్టెలో ఒక ఆడ శిశువు కనిపించిన విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ శిశువును ఆశా జ్యోతి కేంద్రానికి తరలించారు. కాగా గంగలో బాలిక దొరికిందనే విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి పెద్దఎత్తున చేరుకున్నారు. ఈ ఉదంతం గురించి పోలీసు అధికారి విమల్ మిశ్రా మాట్లాడుతూ గంగానదిలో ఒక బాక్సు పడవ నడిపే వ్యక్తికి దొరికిందని, దానిలో శిశువు, ఒక దేవతా చిత్రపఠం, జాతకచక్రం ఉన్న విషయాన్ని గ్రామస్తులు గమనించారన్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.