కొత్త డ్రెస్ కొనివ్వలేదని అమ్మాయి దారుణం.. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు షాక్..

ABN , First Publish Date - 2021-08-04T08:33:38+05:30 IST

ప్రాణం చాలా విలువైనది. కానీ కొంతమంది క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుని తమ ప్రాణాలు..

కొత్త డ్రెస్ కొనివ్వలేదని అమ్మాయి దారుణం.. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు షాక్..

బెంగళూరు: ప్రాణం చాలా విలువైనది. కానీ కొంతమంది క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుని తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. లేదా అవతలి వారి ప్రాణాలు తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మరింత పెరిగాయి. తాజాగా అలాంటి సంఘటనే కర్ణాటకలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు కొత్త దుస్తులు కొనిపెట్టలేదని ఓ 16 ఏళ్ల అమ్మాయి దారుణానికి ఒడిగట్టింది. కుటుంబ సభ్యులకు కడుపుకోత మిగిల్చింది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హెబ్బయ్ ప్రాంతానికి సమీపంలో ఉండే సహకారనగర్‌లో ఓ కుటుంబం నివశిస్తోంది. భార్యభర్తలిద్దరూ రోజు కూలీలు. వారికి 16ఏళ్ల కుమార్తె ఉంది. అయితే సోమవారం తన పుట్టిన రోజు కావడంతో కొత్త డ్రెస్ కావాలని శనివారం తల్లిదండ్రులను కోరింది. అయితే లాక్‌డౌన్ కారణంగా వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. కొత్త డ్రెస్ కొనడం సాధ్యపడదని తల్లిదండ్రులు చెప్పారు.


ఆదివారం ఎప్పటిలానే తల్లిదండ్రులు పనికి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చారు. ఎంత సేపు తలుపు కొట్టినా లోపలి నుంచి అమ్మాయి తలుపు తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. అక్కడ తమ కూతురు ఉరితాడుకు వేలాడుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. కొత్త డ్రెస్ కొనివ్వని కారణంగానే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.


అయితే తల్లిదండ్రులు మాత్రం.. తమ కూతురు సమీప బంధువును ఇష్టపడిందని, అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుందని, కానీ ఇరు కుటుంబాలు దానికి అంగీకరించకపోవడం వల్ల కూడా ఆమె బాధపడుతోందని పోలీసులకు చెప్పారు. 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన తరువాత చదువును కూడా కొనసాగించలేదని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-04T08:33:38+05:30 IST