యూపీలో బాలికపై ఐదేళ్లుగా అత్యాచారం!
ABN , First Publish Date - 2021-10-17T09:02:42+05:30 IST
యూపీలోని లలిత్పుర్లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఎస్పీ, బీఎస్పీ జిల్లా శాఖల అధ్యక్షులతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
హోటల్పై దాడిలో అరెస్టయిన ఎస్పీ, బీఎస్పీ నేతలు
లలిత్పుర్(యూపీ), అక్టోబరు 16: యూపీలోని లలిత్పుర్లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఎస్పీ, బీఎస్పీ జిల్లా శాఖల అధ్యక్షులతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు ఈ అరెస్టులు చేశామని జిల్లా ఎస్పీ నిఖిల్ పాఠక్ శనివారం తెలిపారు. లలిత్పుర్లోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి 25మంది తనపై ఐదేళ్లుగా అత్యాచారాలకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. వీరిపై ఈనెల12న సదర్ కొత్వాలి పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. బాధితురాలి తండ్రి, ఆమె బంధువుపై కూడా కేసు నమోదయ్యింది. మీర్జాపుర్ జిల్లాలోని ఒక హోటల్పై శుక్రవారం పోలీసులు దాడి చేసి తిలక్ యాదవ్(ఎస్పీ), దీపక్ అహిర్వర్(బీఎస్పీ), ఒక ఇంజనీరును అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో లలిత్పూర్ జిల్లా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ ప్రకటించింది.