అప్పు ఇప్పించి.. మోసపోయి
ABN , First Publish Date - 2020-12-03T05:07:00+05:30 IST
తను మధ్యవర్తిగా ఉండి అప్పు ఇప్పించడం ఆ వ్యక్తి పాలిట శాపమైంది. నమ్మిన వ్యక్తి మోసగించడంతో తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం రూరల్ మండలం ఇందిరానగర్ కాలనీలో చోటు చేసుకుంది.
ఇందిరానగర్కాలనీలో వ్యక్తి ఆత్మహత్య
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, డిసెంబరు 2: తను మధ్యవర్తిగా ఉండి అప్పు ఇప్పించడం ఆ వ్యక్తి పాలిట శాపమైంది. నమ్మిన వ్యక్తి మోసగించడంతో తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం రూరల్ మండలం ఇందిరానగర్ కాలనీలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. ఇందిరానగర్ కాలనీలో ఆరంగి రమేష్(46) అనే వ్యక్తి కుటుంబంతో నివాసముంటున్నాడు. ఇతనికి గార మండలం అంబటివానిపేటకు చెందిన హేమ సుందర్ అనే వ్యక్తితో చాన్నాళ్ల కిందట పరిచయం ఏర్పడింది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ హేమసుందర్ పలువురిని నమ్మించిన విధంగానే రమేష్ను కూడా నమ్మించాడు. దీంతో రమేష్ మధ్యవర్తిగా ఉండి పలువురి నుంచి హేమసుం దర్కు అప్పుగా.. ఉద్యోగాల కోసం సుమారు రూ.35 లక్షలు ఇప్పించాడు. ఇలా డబ్బులు ఇచ్చినవారిలో రమేష్ మిత్రులు, బంధువులు కూడా ఉన్నారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా రైల్వేలో ఉద్యోగాలు వేయలేదు. అలాగే, అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా హేమసుందర్ తిరిగి ఇవ్వలేదు. దీంతో మధ్యవర్తిగా ఉన్న రమేష్ను డబ్బులు ఇచ్చినవారు నిలదీసేవారు. ఈ విషయంపై హేమసుందర్ను రమేష్ అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఉద్యోగాల పేరిట చాలామందిని హేమ సుందర్ మోసగించినట్లు రమేష్కు తెలిసింది. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైయాడు. దీన్ని తట్టుకోలేక మంగళవారం రాత్రి నిద్రమాత్రలు మింగి రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం భర్తను నిద్రలేపేందుకు భార్య కాంచన యత్నించింది. అప్పటికే నోటి నుంచి నురగులు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న రమేష్ను హుటాహుటిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించా రు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేశారు. ఇటు ఉద్యోగాల పేరిన పలువురిని మోసగించిన హేమసుందర్పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.