సంక్షోభ కంపెనీలపై గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్ట్టి
ABN , First Publish Date - 2020-11-22T06:27:24+05:30 IST
కరోనా సంక్షోభం తదితర కారణాలతో ఆర్థిక కష్టాల్లోకి జారుకున్న కంపెనీల్లో పెట్టుబడులు, పెట్టడం లేదా వాటిని పూర్తిగా చేజిక్కించుకోవడంపై అంతర్జాతీయ పెట్టుబడి దిగ్గజాలు దృష్టిసారించాయి..
- ఎల్వీబీనే తాజా ఉదాహరణ
- వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడికి ఓక్ట్రీ, వార్డే పార్ట్నర్స్ ఆసక్తి!
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం తదితర కారణాలతో ఆర్థిక కష్టాల్లోకి జారుకున్న కంపెనీల్లో పెట్టుబడులు, పెట్టడం లేదా వాటిని పూర్తిగా చేజిక్కించుకోవడంపై అంతర్జాతీయ పెట్టుబడి దిగ్గజాలు దృష్టిసారించాయి. లక్ష్మీ విలాస్ బ్యాంక్(ఎల్వీబీ) ఇందుకు తాజా ఉదాహరణ. నిధుల కొరతతో సతమతం అవుతున్న ఎల్వీబీని టేకోవర్ చేయాలని సింగపూర్కు చెందిన డీబీఎస్ బ్యాంక్ భారత అనుబంధ విభాగాన్ని ఆర్బీఐ కోరింది. ప్రస్తుతం డీబీఎస్ బ్యాంక్కు దేశంలో 27 బ్రాంచీలున్నాయి. ఎల్వీబీని విలీనం చేసుకోవడం ద్వారా ఈ బ్యాంక్ భారత కార్యకలాపాలు మరింత విస్తృతమవుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. విలీనం తర్వాత డీబీఎస్ ఇండియా డిపాజిట్లు 50 శాతం, నికర రుణాలు 70 శాతం మేర వృద్ధి చెందుతాయని తాజా నోట్లో పేర్కొంది.
ఈ ఏడాదిలో రూ.11,250 కోట్ల పెట్టుబడులు
ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్, వార్డే పార్ట్నర్స్, సెర్బెరస్, ఎస్ఎ్సజీ క్యాపిటల్ వంటి గ్లోబల్ ఫండ్లు భారత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. ఈ ఏడాదిలో ఇప్పటికే భారత కంపెనీలో అంతర్జాతీయ ఫండ్లు 150 కోట్ల డాలర్ల (దాదాపు రూ.11,250 కోట్లు) మేర పెట్టుబడులు గుమ్మరించాయి. ఇవన్నీ పూర్తయిన ఒప్పందాలే. 2019లో గ్లోబల్ ఫండ్లు మన కంపెనీల్లో పెట్టిన మొత్తం పెట్టుబడులతో పోలిస్తే ఈ విలువ 55 శాతం అధికం. ఓక్ట్రీ క్యాపిటల్, వార్డే పార్ట్నర్స్తో కూడిన ఇన్వెస్టర్ల కన్సార్షియం.. వొడాఫోన్ ఐడియాకు 200-250 కోట్ల డాలర్ల (రూ.15,000-18,750 కోట్లు) ఫండింగ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వి గా పేరు మార్చుకున్న వొడాఫోన్ ఐడియా.. నిధులకు కటకటలాడుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్కు గట్టిపోటీనిచ్చే ప్రయత్నాల్లో ఉన్న సంస్థ.. రూ.25,000 కోట్ల మేర నిధులు సేకరించనున్నట్లు సెప్టెంబరులో ప్రకటించింది.