ఘనంగా ప్రపంచ నేల దినోత్సవం
ABN , First Publish Date - 2021-12-06T04:58:07+05:30 IST
ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని తోర్నాల గ్రామంలో ఆదివారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ప్లకార్డులతో నేల రక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
సిద్దిపేట రూరల్, డిసెంబరు 5: ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని తోర్నాల గ్రామంలో ఆదివారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ప్లకార్డులతో నేల రక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడారు. నేల చెడును అరికట్టాలని సూచించారు. పరిమితికి మించిన ఎరువుల వినియోగంతో నేలలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. నేల చెడును అరికట్టకపోతే భవిష్యత్ తరాలకు పెను ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నేల చెడును సమర్థవంతంగా అరికడితేనే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. పంటల సాగు సరళిని, సేంద్రియ ఎరువుల వినియోగం, సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ సాగుపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రామాంజనేయులు, శ్రీనివాస్, సతీష్, సర్పంచ్ దేవయ్య, గ్రామ రైతు సంఘం అధ్యక్షుడు బాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో
మిరుదొడ్డి, డిసెంబరు 5: భూసార పరీక్షల ఆధారంగా పంటలు పండిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చునని కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ జిల్లా అధ్యక్షుడు సుకూరి ప్రవీన్ అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయ నేలను మహిళా రైతులతో కలిసి పరిశీలించారు. నేల పోషక విలువలు తెలుసుకోవడం ద్వారా ఏ పంట వేస్తే లాభాలు వస్తాయో ఆ పంటలు వేయాలన్నారు. అధిక దిగుబడులు వచ్చే పంటలను పండించాలన్నారు. భూసారం తగ్గినప్పుడు పంట దిగుబడి రాదన్నారు. పంట పండించడానికి నేలకు సరిపడ పోషకాలను అందిస్తే నేల, వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టడమేకాక భవిష్యత్తు తరాలకు అనుకూలమైన పంటలను పండించడానికి నేలను అందించగలుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నేలమ్మ సంఘం అధ్యక్షురాలు బాలమణి, సర్పంచు బాల్నర్సింహులు, సీసీసీ సభ్యులు శ్వేత, సుజాత, బాలమణి, భూమవ్వ, సునంద, గాలవ్వ పాల్గొన్నారు.