‘అరబిందో’తో ‘జీఎంఆర్‌’ డీల్‌

ABN , First Publish Date - 2020-09-26T06:31:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సెజ్‌ లిమిటెడ్‌ (కేసెజ్‌)లో తనకున్న 51 శాతం వాటాను అరబిందో రియల్టీకి విక్రయిస్తున్నట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రకటించింది...

‘అరబిందో’తో ‘జీఎంఆర్‌’ డీల్‌

  • కాకినాడ సెజ్‌లో 51 శాతం వాటా విక్రయం 
  • ఒప్పందం విలువ రూ.2,610 కోట్లు 


హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సెజ్‌ లిమిటెడ్‌ (కేసెజ్‌)లో తనకున్న 51 శాతం వాటాను అరబిందో రియల్టీకి విక్రయిస్తున్నట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా అనుబంధ సం స్థ జీఎంఆర్‌ సెజ్‌ అండ్‌ పోర్ట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ (జీఎ్‌సపీహెచ్‌ఎల్‌), అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పం దం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగం గా కేసెజ్‌కు కాకినాడ గేట్‌వే పోర్ట్‌ లిమిటెడ్‌ (కేజీపీఎల్‌)లోని 100 శాతం వాటా కూడా అరబిందో రియల్టీకి బదిలీ కానుందని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా స్పష్టం చేసింది. శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వాటా విక్రయ ఒప్పందం విలువ రూ.2,610 కోట్లు. డీల్‌ పూర్తయిన తేదీన రూ.1,600 కోట్లు లభిస్తాయని, వచ్చే 2-3 ఏళ్లలో కంపెనీ వ్యాపారంలో సాధించే మైలురాళ్ల ఆధారంగా మిగతా రూ.1,010 కోట్లు లభించనున్నట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. ఈ నిధులను ప్రధానంగా గ్రూప్‌ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించనున్నట్లు జీఎంఆర్‌ వెల్లడించింది. నియంత్రణ మండళ్లు, ఇతర అనుమతులకు లోబడి ఈ ఒప్పందం పూర్తికానుంది.


ఆంధ్రప్రదేశ్‌, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ వద్ద పోర్ట్‌ ఆధారిత బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి (మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌) ప్రాజెక్టు అమలు వ్యాపారాన్ని కేసెజ్‌ నిర్వహిస్తోంది. ఇక కేజీపీఎల్‌ విషయానికొస్తే.. తూర్పు గోదావరి జిల్లాలోని కోన గ్రామంలో పర్యావరణహిత వాణిజ్య పోర్టు ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. 


జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా షేరు జూమ్‌ 

కేసెజ్‌లో వాటా విక్రయ వార్తలతో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా షేరు దూసుకు పోయింది. శుక్రవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ షేరు ఏకంగా 11.08 శాతం లాభపడి రూ.23.55 వద్ద స్థిరపడింది.

Updated Date - 2020-09-26T06:31:08+05:30 IST