ఆస్తి పంపకాల్లో కన్నతండ్రినే హతమార్చారు!
ABN , First Publish Date - 2020-10-01T10:11:39+05:30 IST
ఆస్తిలో తమకు రావాల్సిన వాటాలు సక్రమంగా పంచి ఇవ్వడేమోననే అనుమానంతో కన్నతండ్రినే హతమార్చిన కేసులో ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టుచేశారు. మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం రూరల్ సీఐ పి.శేషగిరిరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఇద్దరు నిందితుల అరెస్టు
మంగళగిరి క్రైమ్, సెప్టెంబరు 30: ఆస్తిలో తమకు రావాల్సిన వాటాలు సక్రమంగా పంచి ఇవ్వడేమోననే అనుమానంతో కన్నతండ్రినే హతమార్చిన కేసులో ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టుచేశారు. మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం రూరల్ సీఐ పి.శేషగిరిరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రూరల్ సర్కిల్ పరిధిలోని తాడికొండ మండలం గరికపాడుకు చెందిన తుమాటి సుబ్బారావు (70)కు వెంకటేశ్వరరావు, ఆదయ్య అలియాస్ ఆదియ్య, గోవింద్ అలియాస్ గోవిందయ్య అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.
రెండో కుమారుడు ఆదియ్య వద్ద తండ్రి సుబ్బారావు తలదాచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదియ్యకు తండ్రి సుబ్బారావు ఎక్కడ ఎక్కువ ఆస్తిని పంచిస్తాడోనని వెంకటేశ్వరరావు, గోవిందయ్యలు అనుమానం పెంచుకున్నారు. సెప్టెంబరు 26న తండ్రితో ఆస్తిపంపకాల విషయమై వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన వారు తండ్రిపై కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న తండ్రిని ఆదియ్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు యత్నించాడు.
ఆస్తిపంపకాల వ్యవహారం తేల్చేవ రకూ ఆస్పత్రికి తీసుకువెళ్లనివ్వబోమని వారిద్దరూ అడ్డుకున్నారు. ఇంతలో స్థానికులు, బంధువులు వారిని మందలించి సుబ్బారావును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి మనుమరాలు శివనాగలక్ష్మి ఫిర్యాదుమేరకు తాడికొండ ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదుచేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఉత్తర్వుల మేరకు లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ కె. ఈశ్వరరావు ప్రత్యేక పర్యవేక్షణలో నార్త్సబ్ డివిజన్ డీఎస్పీ దుర్గాప్రసాద్ నేతృత్వంలో రూరల్ సీఐ శేషగిరిరావు దర్యాప్తు చేపట్టి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. సమావేశంలో మంగళగిరి రూరల్, తాడికొండ ఎస్ఐలు శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు.