గో సంరక్షణ అందరి బాధ్యత
ABN , First Publish Date - 2020-12-03T07:13:30+05:30 IST
గోవులను సంరక్షించుకోవడం మనందరి బాధ్యతని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పేర్కొన్నారు.
కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్రసరస్వతి
తిరుపతి(కల్చరల్),డిసెంబరు2: గోవులను సంరక్షించుకోవడం మనందరి బాధ్యతని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పేర్కొన్నారు. తిరుపతిలోని అలిపిరివద్ద ఉన్న గోశాలను బుధవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. గోశాల నిర్మాణ విశేషాలకు సంబంధించిన మ్యాప్ను టీటీడీ ఈవో జవహర్రెడ్డి ఆయనకు చూపించారు. కాలినడక వచ్చే భక్తులు తొలుత గోశాలను ప్రదక్షిణం చేసుకున్నాక శ్రీవారి పాదాల మండపం ద్వారా తిరుమలకు నడిచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. గో తులాభారం మందిరంతోపాటు సుమారు 30 గోవులు ఉండటానికి గోసదన్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మీడియాతో విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. మన సంప్రదాయంలో గోవును పూజిస్తే.. ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు వంశాభివృద్ధి, జ్ఞానం సమృద్ధిగా లభిస్తుందన్నారు. అంతకుముందు ప్రదక్షిణా మందిరం ముందున్న శ్రీకృష్ణుడి విగ్రహానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖర్రెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్జెట్టి, చీఫ్ ఇంజనీర్ రమేష్రెడ్డి, ఎస్వీ గోసంరక్షణశాల సంచాలకుడు హరనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.